బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకంతో విరాట్‌ కోహ్లీ టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ అసలు సెంచరీ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ విరాట్‌ శతకం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బంగ్లాపై గెలవాలంటే టీమిండియాకు 24 పరుగులు కావాలి. ఆ సమయంలో కోహ్లీ 74 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అంటే కోహ్లీ సెంచరీకి 26 పరుగులు కావాలి. 74 పరుగుల తర్వాత 26 పరుగులను పూర్తి చేసిన కోహ్లీ అటు జట్టుకు విజయాన్ని ఇటు శతకాన్ని సాధించాడు. 

 

అయితే బంగ్లా మ్యాచ్‌లో కోహ్లీ శతకం కోసం సింగిల్స్ తీయకుండా ఆడడాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరి నుంచి దీనిపై వ్యతిరేకత వస్తోంది. సెంచరీ కోసం భారత గెలుపును విరాట్ ఆలస్యం చేశాడని కొందరు విమర్శిస్తున్నారు.
  

 

సెంచరీలకు కాదని జట్టు విజయానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పుజారా స్పష్టం చేశాడు. తాను కూడా కోహ్లీ  సెంచరీ సాధించాలని ఎంతగానో కోరుకున్నానని కానీ ఇదే సమయంలో మ్యాచ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని కూడా గుర్తు పెట్టుకోవాలని పుజారా అన్నాడు. నెట్‌ రన్‌రేట్‌తో టీమిండియా అగ్రస్థానంలో ఉండాలని.. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీల్లో నెట్‌ రన్‌ రేట్‌ కీలకమని మర్చిపోవద్దని పుజారా సూచించాడు. కోహ్లీతోపాటు ఇతర ఆటగాళ్లు జట్టుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ఆటగాళ్లు కొంచెం త్యాగం చేయాల్సి ఉంటుందని.. జట్టుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని టీమిండియా ఆటగాళ్లకు పుజారా సూచించాడు. వ్యక్తిగత మైలురాళ్లు జట్టు ప్రయోజనాలకు ఇబ్బంది కాకుడదని వ్యాఖ్యానించాడు. జట్టు గెలిచే క్రమంలో వచ్చే వ్యక్తిగత మైలురాళ్లు కూడా ముఖ్యమేనని పుజారా అన్నాడు. 

 

అసలేంటి వివాదం..?

బంగ్లాపై గెలవాలంటే టీమిండియాకు 24 పరుగులు కావాలి. ఆ సమయంలో కోహ్లీ 74 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అంటే కోహ్లీ సెంచరీకి 26 పరుగులు కావాలి. అయితే విరాట్‌ సెంచరీ వద్దనుకున్నాడని... కానీ తానే సెంచరీ సాధించాలని చెప్పినట్లు రాహుల్‌ వెల్లడించాడు. విరాట్‌ కోహ్లీ సింగిల్స్‌ తీస్తానని చెప్పినా తానే వద్దని చెప్పానని... సెంచరీ సాధించాలని సూచించానని తెలిపాడు. కానీ సింగిల్స్‌ తీయకుంటే బాగుండదని... వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు భావిస్తారని కోహ్లీ తనతో చెప్పాడని రాహుల్‌ వెల్లడించాడు. ఆ తర్వాత రాహుల్‌ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. కోహ్లీకే సెంచరీ సాధించే అవకాశమిచ్చాడు. సింగిల్స్‌ కోసం కోహ్లి ప్రయత్నించినా రాహుల్‌ వెళ్లలేదు. 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 97తో ఉన్నాడు. మూడో బంతికి సిక్సర్‌తో కోహ్లి శతకం అందుకున్నాడు.

ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 256 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయసంగా ఛేదించింది. తొలుత రోహిత్‌, గిల్‌.. విజయానికి గట్టి పునాదీ వేయగా... కోహ్లీ పనిని పూర్తి చేశాడు. అ‌ద్భుత శతకంతో కోహ్లీ టీమిండియాకు మరో విజయాన్ని అందించాడు. సిక్స్‌తో ఇటు భారత జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు కోహ్లీ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో విరాట్‌ 103 పరుగులు చేశాడు.