ఈ ప్రపంచకప్‌లో తొలిసారి క్రికెట్‌ ప్రేమికులందరూ మునివేళ్లపై నిలబడి చూసిన మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినా పాకిస్థాన్‌కు విజయం దక్కలేదు. విజయాన్ని అంత తేలిగ్గా వదులుకునేందుకు సిద్ధంగా లేని దక్షిణాఫ్రికా ఆఖరి వికెట్‌కు విజయం సాధించింది. గతంలో అన్ని ప్రపంచకప్‌లకంటే ఈసారి వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రొటీస్‌ను పాక్‌ కూడా అడ్డుకోలేకపోయింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. పరాజయం ఖాయమనుకున్న దశ నుంచి అద్భుతంగా పుంజుకున్న పాక్‌ బౌలర్లు... మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు.   కానీ చివర్లో సఫారీ బ్యాటర్ల పట్టుదల ముందు పాకిస్థాన్‌ బౌలర్లు తలవంచక తప్పలేదు. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమితో పాకిస్థాన్‌ ఈ ప్రపంచకప్‌ను సెమీస్‌ చేరకుండానే ముగించింది. 



 సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్‌ ఆలౌట్‌ అయింది. ఓ దశలో మూడు వందలకుపైగా పరుగులు చేసేలా కనిపించిన బాబర్‌ సేన ప్రొటీస్‌ బౌలర్లు పుంజుకోవడంతో 270 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సారధి బాబర్‌ ఆజమ్‌ 50, సౌద్‌ షకీల్‌ 52, షాదాబ్‌ ఖాన్‌ 43 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రీజ్‌ షమీ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద పాకిస్థాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 17 బంతుల్లో 9 పరుగులు చేసిన అబ్దుల్లా షఫీక్‌ను జాన్సన్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే 18 బంతుల్లో 12 పరుగులు చేసిన ఇమాముల్‌ హక్‌ను జాన్సన్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో కేవలం 38 పరుగులకే పాకిస్థాన్‌ రెండు వికెట్లు కోల్పోయింది.        పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ పాక్‌ను ఆదుకున్నారు. సమయోచితంగా బ్యాటింగ్‌ చేసిన ఈ జోడీ దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. అడపాదడపా బౌండరీలు కొడుతూ పాక్‌ను భారీ స్కోరు వైపు నడిపించింది. 31 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన మహ్మద్‌ రిజ్వాన్‌ను కాట్జే అవుట్‌ చేసి దెబ్బ కొట్టడంతో 86 పరుగుల వద్ద పాకిస్థాన్‌ జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం ఇఫ్తికార్‌ అహ్మద్‌తో కలిసి బాబర్‌ ఆజమ్‌ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఈసారి షంషీ పాకిస్థాన్‌ దెబ్బ కొట్టాడు. 31 బంతుల్లో 21 పరుగులు చేసిన ఇఫ్తికార్‌ అహ్మద్‌ను షంషీ పెవిలియన్‌ చేర్చాడు. 129 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన పాక్‌.... ఆ తర్వాత కాసేపటికే క్రీజులో స్థిరపడ్డ సారధి బాబర్‌ ఆజమ్‌ వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది. 65 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసిన బాబర్‌ ఆజమ్‌ను షంషీ అవుట్‌ చేశాడు. సౌద్‌ షకీల్‌ పాక్‌ను ఆదుకున్నాడు. 52 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేసి సౌద్‌ షకీల్‌ అవుటయ్యాడు. షాదాబ్‌ ఖాన్ 43, మహ్మద్‌ నవాజ్‌ 24 పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో పాక్‌ 300 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపించింది. కానీ పుంజుకున్న ప్రొటీస్‌ బౌలర్లు వరుసగా వికెట్లను తీశారు. షంషీ నాలుగు, జాన్సన్‌ 3, కోట్జే రెండు వికెట్లు తీశాడు. దీంతో 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయిన పాక్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్‌ ఆలౌట్‌ అయింది. 



 అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 34 పరుగుల వద్ద భీకర ఫామ్‌లో ఉన్న డికాక్‌ వికెట్‌ కోల్పోయింది. బవుమా కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 67 పరుగులకు ప్రొటీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. వరుసగా వికెట్లు పడుతున్నా మార్‌క్రమ్‌ పోరాటం ఆపలేదు. మార్‌క్రమ్‌ ఒంటరి పోరాటంతో దక్షిణాఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. 93 బంతుల్లో 91 పరుగులు చేసి జట్టును సునాయసంగా గెలిపించేలా కనిపించాడు. కానీ పాక్‌ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుసగా వికెట్లు తీసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చారు. అరు వికెట్లకు 225 పరుగుల వద్ద ఉన్న ప్రొటీస్‌ను 259కి ఎనిమిది వికెట్లు ఉన్న స్థితికి తెచ్చారు. రెండు వికెట్లు చేతిలో ఉండగా 38 బంతుల్లో దక్షిణాఫ్రికా 12 పరుగులు చేయాల్సి వచ్చింది. అంతే మ్యాచ్‌ ఏమవుతుందో అన్న ఉత్కంఠ ఊపేసింది. విజయానికి మరో మూడు పరుగులు అవసమైన దశలో పాక్ మరో వికెట్‌ తీసింది. ఉత్కంఠ ఊపేస్తున్న వేళ కేశవ్‌ మహరాజ్‌ బౌండరీ బాది సఫారీ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో పాక్‌ సెమీస్‌ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయి.