Pakistan vs England 1st Test Day 5 Highlights: పాకిస్థాన్(Pakistan) జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపైనా పసికూనగా మారిపోయిన పాక్ ను.. ఇంగ్లాండ్(England) జట్టు చిత్తుచిత్తుగా ఓడించింది. బంగ్లాదేశ్(Bangladesh)  తో సొంతగడ్డపై జరిగిన అవమానాన్ని మర్చిపోకముందే పాక్  మరో ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. ఏకంగా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై బ్రిటీష్ జట్టు ఘన విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ త్రిబుల్ సెంచరీ, జో రూట్ డబుల్ సెంచరీతో కొండంత స్కోరు చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో పాక్ ను 220 పరుగులకే మట్టికరిపించింది. దీంతో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ తొలి టెస్టులో విజయదుంధుభి మోగించింది. ఇంగ్లాండ్ బౌలర్ జాక్ లీచ్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.


 

పోరాటం లేకుండానే

సొంతగడ్డపై పాకిస్థాన్ కష్టాలు కొనసాగుతున్నాయి. వరుస పరాజయాలు ఎదురవుతున్నా కనీస పోటీ లేకుండా దాయాది జట్టు విఫలమవుతుండడం క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ముల్తాన్ టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. బజ్ బాల్ ఆటతీరుతో అదరగొట్టిన బ్రిటీష్ జట్టు.. పాక్ ను రెండో ఇన్నింగ్స్ లో కేవలం 220 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ చివరి రోజు బ్యాటింగ్ కు రాకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు విజయం ఖాయమైంది. అబ్రార్ అహ్మద్  తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరడంతో చివరి రోజు బ్యాటింగ్ చేయలేకపోయాడని పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. నాలుగో రోజు ముగిసే సమయానికి పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. చివరి రోజు అమీర్ జమాల్, అఘా సల్మాన్ కాసేపు పోరాడినా అది సరిపోలేదు. సల్మాన్ - జమాల్ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించారు. వీరిద్దరూ 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ విరామం తర్వాత ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బంతి అందుకున్న తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. సల్మాన్ ను బౌల్డ్ చేసిన లీచ్... పాక్ ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. మరోవైపు దూకుడు కొనసాగించిన జమాల్ అర్ధ శతకం సాధించాడు. కానీ జాక్ లీచ్ షాహీన్ అఫ్రిదిని అవుట్ చేయడంతో పాక్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్ కూడా నేలకూలడంతో పాక్ ఓటమి పరిపూర్ణమైంది. 

 

ఆ ఆశలు నెరవేరలేదు..

బంగ్లాదేశ్ సిరీస్ ఓటమి తరువాత పాకిస్థాన్ జట్టులో కసి పెరిగిందని ఆ జట్టు ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో మెరుగ్గా రాణిస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లే తొలి ఇన్నింగ్స్ లో అబ్దుల్లా షఫీక్, కెప్టెన్ షాన్ మసూద్, అఘా సల్మాన్‌ల సెంచరీలతో వారు 556 పరుగులు చేశారు. కానీ బాబర్ ఆజం , మహ్మద్ రిజ్వాన్ పేలవ ఫామ్ కొనసాగింది. పాక్ బ్యాటర్లు పర్వాలేదనిపించినా.. బౌలర్లు మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు రికార్డుల మీద రికార్డులు సృష్టించి... పాక్ బౌలర్లను ఉతికి పిండి ఆరేశారు.  సౌద్ షకీల్ మినహా, మిగతా ప్రతి పాక్ బౌలర్ 100కి పైగా పరుగులు చేశాడు.

 

సొంతగడ్డపై మరీ ఇలానా...

2022 నుంచి స్వదేశంలో పాకిస్థాన్ జట్టు ఒక్క మ్యాచు కూడా గెలవలేదు. మీరు వింటున్నది నిజమే గత రెండేళ్ల నుంచి పాకిస్థాన్.. సొంతగడ్డపై కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచు కూడా గెలవలేదు. 2022 నుంచి స్వదేశంలో  పాకిస్థఆన్ 11 టెస్టులు ఆడగా.. అందులో 7 ఓడిపోయింది. మిగిలిన నాలుగు టెస్టులు డ్రాగా ముగిశాయి.