Pakistan Cricket Board appointed interim head coach: ఈ నెలాఖరులో న్యూజిలాండ్‌తో  స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌(T20 Series)కు పాక్‌ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా మహ్మద్ యూసుఫ్(Mohammad Yusuf), అసిస్టెంట్ కోచ్‌గా అబ్దుల్ రజాక్‌( Abdul Razzaq)లను నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) నిర్ణయించింది. విదేశీ కోచ్‌లు గ్యారీ కిర్‌స్టన్, జాసన్ గిల్లిస్పీతో చర్చలు కొనసాగుతున్న వేళ... తాత్కాలికంగా మహ్మద్‌ యూసుఫ్‌ను తాత్కాలిక ప్రధాన కోచ్‌గా నియమించినట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది. టెస్ట్‌ జట్టు ప్రదాన కోచ్‌గా గిలెస్పీ  బాధ్యతలు స్వీకరించడానికి ఇప్పటికే అంగీకరించాడని... గ్యారీ కిర్‌స్టెన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని పాక్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. గిలెస్పీ తన ఫీజులు, పాక్‌లో ఎన్ని రోజులు ఉండాలన్న దానిపై కొన్ని షరతులు విధించాడని... దానికి పీసీబీ అంగీకరించిందని పీసీబీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, T20 ప్రపంచ కప్ తర్వాత అందుబాటులో ఉంటానని గిలెస్పీ చెప్పినట్లు తెలుస్తోంది. కిర్‌స్టన్ వన్డే జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉంటాడు. బౌలింగ్ కోచ్‌లు, ఉమర్ గుల్, సయీద్ అజ్మల్‌ల నియామకంపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


రోడ్డు ప్రమాదంలో పాకిస్థాన్ మహిళా క్రికెటర్లకు గాయాలు: 


పాకిస్థాన్‌ ఉమెన్‌ క్రికెటర్లు(Pakistan Women Cricketers) శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ బిస్మా మరూఫ్(Bismah Maroof), లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమా(Ghulam Fatima) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.  ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాయ్యాయి.  ప్రమాదం ఏప్రిల్ 5 శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించామని, తదుపరి చికిత్స నిమిత్తం వారిని బోర్డు వైద్య బృందం సంరక్షణలో ఉంచామని పీసీబీ(PCB) ఒక ప్రకటనలో తెలిపింది. వారికి కావాల్సిన పూర్తి వైద్యసేవలను అందిస్తామని కూడా పాక్‌ బోర్డు ప్రకటించింది.


పురుషుల జట్టుకు ఆర్మీ ట్రైనింగ్: 


పాకిస్థాన్ క్రికెటర్ల ఫిట్‌నెస్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ  కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2024 సీజన్ ముగిసిన వెంటనే జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంతో కఠిన శిక్షణ ఇప్పిస్తోంది.  సైన్యంలో శిక్షణతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ మెరుగుపడుతుందని భావించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు... పాక్‌ క్రికెటర్లకు సైనికుల నేతృత్వంలో కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణకు పంపింది. సైనిక శిక్షణ వల్ల పాక క్రికెటర్ల ఫిట్నెస్ మరింత మెరుగుపడుతుందని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఆటగాళ్ల సైనిక శిక్షణకు సంబంధించిన వీడియోను కూడా పాక్‌ క్రికెటర్‌ బోర్డు విడుదల చేసింది. ప్రస్తుతం వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో కసరత్తులు చేస్తున్నారు. వీరికి ఫిట్‌నెస్‌ను పెంచే వ్యాయామాలతో పాటు సైనికుల తరహాలో కఠిన శిక్షణ ఇస్తున్నారు. బాబర్‌ అజామ్‌, రిజ్వాన్‌తో పాటు దాదాపు 30 మంది ఆటగాళ్లు దీనిలో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌ క్రికెట్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.