Reason behind RCB s loss to Rajasthan Royals: ఐపీఎల్‌(IPL)లో బెంగళూరు(RCB) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ బెంగళూరు ఓడిపోయింది. విరాట్‌ కోహ్లీ శతకంతో చెలరేగినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కింగ్‌ కోహ్లీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే తొలి శతకంతో చెలరేగిన వేళ... రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ మరో 5 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. జోస్‌ బట్లర్‌, సంజు శాంసన్‌ విధ్వంసంతో రాజస్థాన్‌(RR)... బెంగళూరుపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమికి కారణాలు చూస్తే...


 

శుభారంభం లభించినా....

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరుకు.. ఓపెనర్లు శుభారంభం అందించారు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ తొలి వికెట్‌కు 84 బంతుల్లోనే 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ డు ప్లెసిస్ ఔటైన తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఈ ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీని కారణంగా బెంగళూరు స్కోరు 200 పరుగులు దాటలేకపోయింది. డుప్లెసిస్‌ వికెట్ పడిన తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. సౌరవ్ చౌహాన్ కూడా 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కెమెరాన్ గ్రీన్ 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

 

మంచు ప్రభావం

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టమైందని బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌ అన్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మంచు వల్ల బ్యాటింగ్ చేయడం సులభతరమైందని విశ్లేషించాడు. మంచు కారణంగా బెంగళూరు బౌలర్లు.. బంతిపై నియంత్రణ కోల్పోయారు.

 

మయాంక్ దాగర్ బౌలింగ్‌.. 

184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన రాజస్థాన్ జట్టు తొలి 5 ఓవర్లలో 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ ఆరో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన మయాంక్ దాగర్... ఒక్క ఓవర్‌లోనే  20 పరుగులు ఇవ్వడంతో ఊపు రాజస్థాన్ వైపు వెళ్లింది. మయాంక్ డాగర్ ఒక్క ఓవర్లో 20 పరుగులు ఇవ్వడంతో తమపై ఒత్తిడి పెరిగిందని కెప్టెన్‌ డు ప్లెసిస్ కూడా అంగీకరించాడు. డాగర్ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఏకంగా 34 రన్స్ ఇచ్చాడు.

 

పేలవమైన ఫీల్డింగ్

రాజస్థాన్‌పై బెంగళూరు ఫీల్డింగ్‌ చాలా సాధారణంగా ఉంది. క్యాచ్‌లు చేజారాయి. ఇదే మ్యాచ్‌ను బెంగళూరు నుంచి లాగేసుకుంది. జైస్వాల్ రూపంలో తొలి వికెట్‌ను సున్నాకి కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ జట్టును ఆర్‌సీబీ ఒత్తిడిలో పడేసింది. కానీ అదే సమయంలో ఆర్‌సీబీకి మరో వికెట్ దక్కే అవకాశం వచ్చింది. బట్లర్ 6 పరుగుల వద్ద క్యాచ్ ఇవ్వగా, కామెరాన్ గ్రీన్ ఆ బంతిని మిస్ చేశాడు. 

 

కోహ్లీ మ్యాక్సీ కూడా...

గ్లెన్ మాక్స్‌వెల్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు RCBకి చివరి 5 ఓవర్లు మిగిలి ఉన్నాయి. కానీ మ్యాక్సీ అవుట్‌ కావడంతో జట్టు స్కోరు వేగం పుంజుకోలేదు. కేవలం 3 బంతుల్లో 1 పరుగు చేసి మాక్స్‌వెల్‌ ఔట్ అయ్యాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ72 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓటమికి విరాట్ కోహ్లీ కూడా ఓ కారణమని పలువురు అంటున్నారు. ఎందుకంటే కోహ్లీ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా ఉందని చెబుతున్నారు.