ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహా సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఈ ప్రపంచకప్‌లోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు రణ క్షేత్రం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ వేదికపై చిరకాల ప్రత్యర్థులు అమితుమీ తేల్చుకోనున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య పోరును సాధారణ మ్యాచ్‌ల కాకుండా ఇరు దేశాల అభిమానలు ఓ యుద్ధంలా చూస్తారు. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు కనురెప్ప ఆర్పకుండా ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తారు. ప్రపంచ క్రికెట్‌ లోకమే ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఇవాళ(శనివారం‌) మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది.

 

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ నేడు తలపడతాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరుజట్లు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలో  సారథి రోహిత్‌, విరాట్‌ కోహ్లీ, KL రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉండడం సహా బౌలింగ్‌ విభాగంలో బుమ్రా మెరుపులు భారత్‌ను ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా నిలిపాయి. 1992 నుంచి ఇప్పటివరకూ ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా అన్నిసార్లూ భారత్‌ విజయం సాధించింది. తాజా ప్రపంచకప్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని రోహిత్‌ సేన ఉవ్విళ్లురుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఫేవరేట్‌గా కనిపిస్తోంది. డెంగీ నుంచి కోలుకున్న శుభ్‌మన్‌ గిల్ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అయితే పాక్‌తో మ్యాచ్‌లో గిల్‌ ఆడడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ శుభ్‌మన్‌ తుది జట్టులో లేకపోతే ఇషాన్‌ కిషన్‌కు మరో అవకాశం దక్కనుంది. 

 

బౌలింగ్‌ విభాగంలోనూ భారత్‌ జట్టు పటిష్ఠంగానే కనిపిస్తోంది. స్టార్‌ బౌలర్ బుమ్రా ఫామ్‌లో ఉండగా స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా రాణిస్తున్నారు. మహ్మద్‌ సిరాజ్‌ స్థానంలో మహ్మద్‌ షమీని తుది జట్టులోకి తీసుకోవచ్చు. ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలని టీమిండియా భావిస్తే శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు బౌలింగ్‌ విభాగంలో పెద్దగా సమస్యలు లేకపోయినప్పటికీ బ్యాటింగ్‌ విభాగంలో పాక్‌ జట్టు పూర్తిగా సారథి బాబర్ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిదిపైనే ఉంటుంది.పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. 

 

ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై వరుసగా ఎనిమిదో విజయం కోసం మైదానంలోకి దిగనుంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్తాన్‌లు మొత్తం ఏడుసార్లు తలపడగా, అందులో టీమ్‌ఇండియా ప్రతిసారీ విజయం సాధించింది. 1992లో వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరి మధ్య తొలి పోటీ జరిగింది. ఆ తర్వాత 1996, 1999, 2003, 2011, 2015, 2019 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ప్రతీసారీ టీమిండియానే గెలిచింది.

 

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్

 

పాకిస్థాన్ జట్టు:

బాబర్ ఆజం (సి), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది , మహ్మద్ వాసిం.