IND vs SA T20:

  వెన్ను గాయంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 3 టీ20ల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. గువాహటి వేదికగా అక్టోబర్ 2న రెండో టీ20, ఇండోర్ వేదికగా అక్టోబర్ 4న మూడో టీ20 జరగనున్నాయి. 


దక్షిణాఫ్రికా సిరీస్ కు భారత జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్



మెగా టోర్నీకి బుమ్రా దూరం!


ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న 2022 టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.  భారత ప్రధాన పేస్ బౌలర్, యార్కర్ స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు గాయం కారణంగా దూరం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టీ20లో కూడా జస్‌ప్రీత్ బుమ్రా ఆడలేదు. సర్జరీ అవసరం లేనప్పటికీ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 4 నుంచి 6 నెలల సమయం పట్టనుందని తెలుస్తోంది.



బుమ్రాకు వెన్ను గాయం పెద్ద సమస్యగా మారింది. బుమ్రా బౌలింగ్ శైలి వల్ల అతని వెన్నెముకపై భారం పడుతుందని.. దానివల్ల అతనికి వెన్ను సమస్యలు వచ్చే అవకాశం ఉందని వెస్టిండీస్ పేస్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ గతంలోనే చెప్పాడు.


వెన్ను గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా అంతకుముందు ఈ సంవత్సరంలోనే జరిగిన ఆసియా కప్‌కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఒక నెల గడిపాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. మొహాలీలో జరిగిన మొదటి టీ20 తప్ప మిగిలిన 2 మ్యాచ్‌లు ఆడాడు.


ఇప్పటికే దూరమైన ఆల్ రౌండర్ జడేజా


భారత బెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరం అయ్యాడు. ఇప్పుడు బుమ్రా కూడా దూరం కావడం టీమిండియాకు మరో షాక్ అని చెప్పవచ్చు. వీరి గైర్హాజరు టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపించనుంది.


బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై ఆటగాళ్లుగా ఉన్న మహ్మద్ షమీ లేదా దీపక్ చాహర్‌లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.