సౌతాఫ్రికా (South Africa)తో టెస్ట్ మ్యాచుకు సిద్దమవుతున్న వేళ టీం ఇండియా(Team India)కు మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఇప్పటికే గాయం కారణంగా షమీ(Shammi) టెస్ట్ సిరీస్ కు దూరం కాగా తాజాగా ఇషాన్ కిషన్(Ishan Kishan)  టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇషాన్ కిషన్ నట్టు నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ(BCCI) వెల్లడించింది.. ఇషాన్ కిషన్ స్థానంలో కె. ఎస్. భరత్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే టెస్టు జట్టు నుంచి ఇషాన్‌ కిషన్‌ తప్పుకోవడంపై  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనూహ్యంగా ఇషాన్ తప్పుకోవడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఇషాన్‌ స్వదేశానికి తిరిగిరావడానికి గల కారణాలు ఏంటన్నది అటు బీసీసీఐ గానీ ఇటు ఇషాన్‌ గానీ వెల్లడించలేదు. కానీ మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇషాన్ కిషన్ సౌతాఫ్రికా పర్యటన నుంచి స్వదేశం తిరిగి వచ్చాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అతడు కొన్నాళ్లు ఆటకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

 

మానసిక కుంగుబాటేనా.?

ఏడాదికాలంగా విరామం లేకుండా జట్టుతో ప్రయాణం చేసిన ఇషాన్‌ కిషన్‌.. తుది జట్టులో ఆడింది మాత్రం చాలా తక్కువ.  ఎవరైనా అందుబాటులో లేకుంటేనే ఇషాన్‌కు ఛాన్స్‌లు వస్తున్నాయి తప్పితే టీమిండియా తుది జట్టులో కిషన్‌కు పెద్ద అవకాశాలు రావడం లేదు. జట్టులో చోటు దక్కకపోవడంతో ఇషాన్‌కు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నాడని, అందుకే అతడు కొన్నాళ్లు ఆట నుంచి విరామం తీసుకునేందుకు దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ వరకు ఆటకు దూరంగా ఉండాలని ఇషాన్ కిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్ట్‌లతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 29.64 సగటుతో 741 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి.

 

ఇప్పటికే స్వదేశానికి  కోహ్లీ

మరోవైపు దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం తీవ్రత కారణంగా టెస్టు సిరీస్‌ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. చేతి వేలికి గాయం కారణంగా రుతురాజ్‌ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్‌ నుంచి వైదొలిగాడని స్పష్టం చేసింది. రుతురాజ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని... అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వెల్లడించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి భారత్‌కు వస్తాడని... జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రుతురాజ్‌ గైక్వాడ్‌ స్థానంలో బెంగాల్‌ ప్లేయర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, బెంగాల్‌ క్రికెటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ టెస్ట్‌ సిరీస్‌కు దూరం కావడంతో ఈశ్వరర్‌కు లక్కీగా ఛాన్స్‌ వచ్చింది. సర్ఫరాజ్‌కు మాత్రం మరోసారి మొం‍డిచేయే ఎదురైంది.

తాజాగా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ.దక్షిణాఫ్రికా నుంచి ఆకస్మికంగా తిరిగి భారత్‌కు వచ్చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ కారణంగా కోహ్లీ సౌతాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 26 నుంచి మొదలయ్యే మొదటి టెస్టు నాటికి కోహ్లీ జట్టుతోపాటు చేరే అవకాశం ఉంది.