BCCI message to Rishabh Pant: భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ నుంచి క్లియర్ మెసేజ్ వచ్చింది. ‘ఫిట్‌గా తయారవ్వకపోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.’ అని క్లియర్‌గా తెలిపారు. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు రిషబ్ పంత్‌కు చోటు దక్కలేదు. ఈ ఏడాది వైట్ బాల్ క్రికెట్‌లో అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. రిషబ్ పంత్ ఇప్పటికే వెన్ను, మోకాలి గాయాలతో కూడా పోరాడుతున్నాడు. శ్రీలంక సిరీస్‌లో సెలక్టర్లు పంత్‌ను తప్పించి, అతనికి గట్టి సందేశం ఇచ్చారు.


నేషనల్ అకాడమీకి...
శ్రీలంక సిరీస్ నుంచి రిషబ్ పంత్ తప్పుకోవడంతో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి పిలుపొచ్చింది. బీసీసీఐ అధికారి ఒకరు పంత్ గురించి మాట్లాడుతూ “అతను రాబోయే తరంలో మంచి ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఏడాది వన్డేలు, టీ20ల్లో అతని ఫామ్ నిరాశపరిచింది. అతను మరింత ఫిట్‌గా, చురుకుదనంతో ఉండాలని కోచింగ్ సిబ్బంది కోరుకుంటున్నారు. NCAలో శిక్షణ కోసం అడిగారు." అని చెప్పారు


దీంతో పంత్ వైట్ బాల్ క్రికెట్‌లో ఎంపిక అవ్వాలంటే అతడు పూర్తి ఫిట్‌గా ఉండి, ఫామ్‌లోకి రావాడని బీసీసీఐ స్పష్టం చేసింది. శ్రీలంక సిరీస్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లకు ప్రాధాన్యత ఇచ్చారు.


ఈ ఏడాది వైట్ బాల్ క్రికెట్‌లో రిషబ్ పంత్ పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. 12 వన్డేల్లో 37.33 సగటుతో 336 పరుగులు చేశాడు. ఇందులో ఇంగ్లండ్‌పై సెంచరీ కూడా ఉంది. అదే సమయంలో అతను 25 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కేవలం 21.41 సగటుతో 364 పరుగులు చేశాడు.


ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో మరోసారి టీమిండియా స్టార్ ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు. ఈ ఏడాది పంత్ 7 మ్యాచ్‌లు ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుండి రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు వచ్చాయి.