Team India In T20 World Cup 2024: కప్పు ముఖ్యం బిగులూ అన్నట్టు ఉంది ప్రస్తుతం టీం ఇండియా పరిస్థితి. ప్రస్తుతం ఆడుతున్న వారిలో చాలా మందికి ఇదే చివరి మేజర్‌ టోర్నీ. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజా, చాహల్‌ ఇలా ఆరేడు మందికి దాదాపుగా ఇదే ఆఖరి ప్రపంచకప్‌. అందుకే కచ్చితంగా ఈ కప్‌ను గెలుచుకొని రావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 


ఇప్పుడు టీ20 ఆడుతున్న ఇండియన్ టీంలో దాదాలు చాలా మంది వయసు ముప్పై ప్లస్ ఉంది. గతేడాదే వన్డే వరల్డ్‌కప్ జరిగింది. ఇప్పుడు ఏడాది గ్యాప్‌లోనే టీ20 వరల్డ్‌కప్ జరుగుతోంది. మరో మూడు నాలుగేళ్ల వరకు వీళ్లంతా ఆడేది అనుమానంగానే ఉంది. అందరి కంటే ముందు హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌కు ఇదే ఆఖరి ప్రపంచ కప్‌ కాదు... ఇదే ఆఖరి టోర్నీ కూడా. ఈ టోర్నీ అయిన తర్వాత ఆ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్ తప్పుకుంటారు. 


బీసీసీఐ కొత్త కోచ్ కోసం ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందుకే ఈ టోర్నీ తర్వాత రాహుల్ ద్రవిడ్‌ వీడ్కోలు చెప్పక తప్పదు. అసలు టీ 20 వరల్డ్‌కప్‌కే కొత్త కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో అది జరగలేదు. అందుకే ఈ టోర్నీని రాహుల్‌నే ప్రధాన కోచ్‌గా కొనసాగించారు. 


రవిశాస్త్రి తర్వాత భారత్ క్రికెట్‌ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఆడుతున్నప్పుడు కానీ, కోచ్‌గా ఉన్నప్పుడు కానీ ఒక్కటంటే ఒక్క ప్రపంచ కప్‌ గెలవలేదు. మొన్నటి వన్డే ప్రపంచ కప్‌ ఆఖరి మెట్టు వద్ద ఘోరంగా విఫలమైంది భారత్ టీం. కచ్చితంగా ఈసారి కప్‌ వస్తుందని ఆశించిన క్రికెట్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఇప్పుడు కనీసం పొట్టి కప్‌ అయినా గెలవాలని కోరుకుంటున్నారు. 


రాహుల్ ద్రవిడ్‌ హెడ్‌ కోచ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టీమిండియా ఆట తీరులో చాలా మార్పులు వచ్చాయి. అందుకు గత ప్రపంచ కప్‌లో భారత్ దూకుడు ఆట తీరే ఇందుకు నిదర్శనం. ఎంత దూకుడుగా ఆడుతున్నప్పటికీ ట్రోఫీలు మాత్రం ఊరించి ఉసూరుమనిపిస్తున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌, వన్డే వరల్డ్ కప్‌, గత టీ 20 వరల్డ్‌ కప్ ఇలా అన్ని అందినట్టే అంది చేజారి పోతున్నాయి. అందుకే కచ్చితంగా ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న టీ 20 వరల్డ్‌ కప్‌ కైవశం చేసుకోవడానికి ద్రవిడ్‌కు ఇదే చివరి ఛాన్స్. 


రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌గా 2021లో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రతిభావంతులకు ఛాన్స్‌లు ఇస్తూ టీమిండియాను చాలా పవర్‌ ఫుల్‌గా తయారు చేశారు. అయితే ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం లోటుగా మిగిలిపోతోంది. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ ఒప్పందం వరల్డ్‌ కప్‌ తర్వాతే ముగిసింది. అయితే కోచ్‌ నియామక ప్రక్రియ ఆలస్యమవుతున్న టైంలో ఆయన కాంట్రాక్ట్‌ బీసీసీఐ టీ20 వరల్డ్‌కప్‌ పూర్తి అయ్యే వరకు పొడిగించింది.


రాహుల్ ద్రవిడ్‌కు ఇదే ఆఖరి ఐసీసీ ఈవెంట్ కావడంతో కచ్చితంగా గెలవాలని టీం భావిస్తోంది. అంతే కాకుండా ఈ పొట్టి ప్రపంచకప్‌ గెలిచి 11 ఏళ్లు అయింది. రెండు ముచ్చట్లు తీర్చేలా టీం సన్నద్ధమవుతోంది. రాహుల్ నేతృత్వంలో 2023లో ఆసియా ట్రోఫీ మాత్రమే గెలుచుకుంది. అప్పటి వరకు పేలవమైన ఆటతీరుతో విమర్శలు పాలైన జట్టు ఒక్కసారిగా గేర్ మార్చింది. 


గేర్ మార్చిన టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌లో విజృంభించింది. ఫైనల్‌ వరకు ఎలాంటి ఓటమి అనేది లేకుండా దూకుడా వెళ్లింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో ఘోర పరాజయం పొందింది. సొంత గడ్డపై ఓటమిని నేటికీ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆ కసిని ఈ టీ 20 వరల్డ్‌కప్‌లో తీర్చాలని కోరుకుంటున్నారు. ఆ ఆకాంక్షతోపాటు టీమిండియాతో రాహుల్‌ ద్రవిడ్‌తోపాటు చాలామందికి ఇదే చివరి ఛాన్స్‌ కాబట్టి కప్‌ ముఖ్యం బిగులు అని ఫ్యాన్స్‌ అంటున్నారు.