ఈ ప్రపంచకప్‌లో తొలిసారి క్రికెట్‌ ప్రేమికులందరూ మునివేళ్లపై నిలబడి చూసిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన ప్రొటీస్‌ ఆఖరి వికెట్‌కు విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉంది. టీమిడియా రెండో స్థానానికి పడిపోయింది. ప్రొటీస్‌, భారత జట్లు  అయిదు మ్యాచుల్లో నెగ్గి 10 పాయింట్లతో సమానంగా ఉన్నా... నెట్‌ రన్‌రేట్‌ పరంగా టీమిండియా కంటే దక్షిణాఫ్రికా మెరుగ్గా ఉంది. అందుకే పాయింట్ల పట్టికలో టాప్‌ లేపింది. ఈ మ్యాచ్‌లో బౌండరీ కొట్టి దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన కేశవ్‌ మహరాజ్‌పై ఇప్పుడు అందరి దృష్టి పడింది.  ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఆడిన కేశవ్ మహారాజ్... కేవలం 7 పరుగులే చేశాడు. ఈ ఏడు పరుగులే పాకిస్థాన్‌ విజయావకాశాలపై నీళ్లు చల్లాయి. పాక్ ప్రధాన బౌలర్లు షాహీన్, రవూఫ్, వసీం కోటా అయిపోయేంత వరకూ ఓపిగ్గా ఆడిన కేశవ్.. నవాజ్ బౌలింగ్‌‌లో బౌండరీ బాది జట్టును గెలిపించాడు. చివరి వికెట్‌కు అద్భుత షాట్‌తో విజయాన్ని అందించిన కేశవ్‌ మహరాజ్‌ సింహ నినాదం చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇంతకీ ఈ కేశవ్‌ మహరాజ్‌ ఎవరంటే...

 

పూర్వీకులు భారతీయులే...

  కేశవ్ పూర్వీకులు భారత్ నుంచి ఉపాధి నిమిత్తం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. కేశవ్ తండ్రి ఆత్మానందం కూడా క్రికెట్ ఆడినా వర్ణవివక్ష కారణంగా ఎదగలేకపోయాడు. తొలి నాళ్లలో సీమ్ బౌలర్, ఆల్‌రౌండర్ అయిన కేశవ్.. తర్వాత స్పిన్నర్ అవతారం ఎత్తాడు. 2016లో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత టీ20ల్లోకి అడుగుపెడుతూనే సౌతాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కేశవ్ దక్షిణాఫ్రికాలోనే పుట్టిపెరిగినప్పటికీ.. హిందూ సంప్రదాయాలను పాటిస్తాడు. హనుమాన్ భక్తుడైన అతడి బ్యాట్‌పై ఓం గుర్తు ఉంటుంది. అతడి భార్య లెరీసాకు కూడా భారత మూలాలు ఉన్నాయి. ఆమె కథక్ డ్యాన్సర్ కూడా. పాక్ బౌలర్లు తప్పులు చేసే దాకా వేచి చూసిన కేశవ్‌ మహరాజ్‌ సఫారీ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో ఓడటం సౌతాఫ్రికాకు అలవాటు. కానీ ఒత్తిడిని అధిగమించిన భారత సంతతి ఆటగాడైన కేశవ్‌ మహరాజ్‌ పాక్‌పై తన జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

 

ఇక ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం వాకిట బోర్లా పడింది. పాక్ విజయానికి ఒకే ఒక్క వికెట్ దూరంలో నిలిచింది.  సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్‌ ఆలౌట్‌ అయింది. పాక్ బ్యాటర్లలో సారధి బాబర్‌ ఆజమ్‌ 50, సౌద్‌ షకీల్‌ 52, షాదాబ్‌ ఖాన్‌ 43 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రీజ్‌ షమీ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 47.2 ఓవర్లలో కష్టంగా మ్యాచ్‌ను ముగించింది. అయిడెన్‌ మార్‌క్రమ్‌ (91: 93 బంతుల్లో 7×4,3×6)) తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.