Jay Shah set to continue as ACC president:  బీసీసీఐ(BCCI)  కార్యదర్శి జై షా(Jay Shah )ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(Asian Cricket Council) అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. బాలీలో జరిగిన వార్షిక సమావేశంలో శ్రీలంక క్రికెట్‌ అధ్యక్షుడు షమ్మీ సిల్వా జై షా పేరును ప్రతిపాదించగా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ తర్వాత జై షా 2021 జనవరిలో మొదటిసారిగా ఈ పదవికి ఎన్నికయ్యారు. తనపై నమ్మకముంచి మరోసారి బాధ్యతలు అప్పగించిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సభ్యులందరికి జై షా ధన్యవాదాలు తెలిపారు. ఆసియా అంతటా క్రికెట్‌ను విస్తరించేందుకు ఏసీసీ పాటుపడుతోందని.. క్రికెట్‌ ఎక్కువగా అభివృద్ధి చెందని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జై షా అన్నారు. జై షాకు ఏసీసీ ఉపాధ్యక్షుడు, ఒమన్‌ క్రికెట్‌ ఛైర్మన్‌ పంకజ్‌ కిమ్జీ జై షాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నిర్వహించే టోర్నమెంట్‌లలో పెట్టుబడులు పెట్టడానికి వాటాదారులు ముందుకువస్తున్నారని కిమ్జీ తెలిపారు. జై షా నాయకత్వంలో ఆసియాలో క్రికెట్‌ మరింత అభివృద్ధి చెందుతుందని ఏసీసీతో కలిసి పని చేయాలని నజ్ముల్‌ హసన్‌ ఉద్ఘాటించారు. 


ఐపీఎల్‌కి సిద్ధమవుతున్న బీసీసీఐ
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL 2024)లో మినీ వేలం ప్రక్రియ ముగిసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్‌ క్రికెట్‌(Cricket) సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి 23 నుంచి మే 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్టు 74 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. అందుబాటులో ఉన్న ప్లేయర్లు ప్రాంచైజీల పర్యవేక్షలో ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. అయితే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ టైటిల్ హ‌క్కుల‌ను టాటా గ్రూప్ కంపెనీ ద‌క్కించుకుంది. 2028 వ‌ర‌కు టాటానే టైటిల్ స్పాన్సర్‌గా వ్యవ‌హ‌రించ‌నుంది. అయిదేళ్ల వరకూ టాటా గ్రూప్ భార‌త క్రికెట్ బోర్డుతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.


భారీ ఒప్పందం
బీసీసీఐ(BCCI)తో టాటా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఐపీఎల్(IPL) సీజ‌న్‌కు టాటా సంస్థ.. బీసీసీఐకి రూ.500 కోట్లు ముట్టజెప్పనుంది. ఇన్విటేష‌న్ టు టెండ‌ర్ నిబంధ‌న‌ల ప్రకారం టాటా గ్రూప్ భార‌త్‌కు చెందిన మ‌రో కార్పొరేట్ కంపెనీ ఆఫ‌ర్‌ను అంగీరించ‌వ‌చ్చు. ఆదిత్యా బిర్లా గ్రూప్ రూ.2,500 కోట్ల ఆఫ‌ర్ ప్రక‌టించింది. టాటా కంపెనీ తొలిసారి 2022లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హ‌క్కులు ద‌క్కించుకుంది. చైనాకు చెందిన వివో కంపెనీ టైటిల్ స్పాన్సర్‌గా వైదొల‌గ‌డంతో టాటాకు అవ‌కాశం వ‌చ్చింది. దాంతో, ప్రతి సీజ‌న్‌కు బీసీసీఐకి రూ.365 కోట్లు చెల్లించేందుకు టాటా అంగీక‌రించింది.


ధోనీ బరిలోకి దిగడం ఖాయం
ఐపీఎల్ 2023 తరువాత ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. గతేడాది టోర్నీ సమయంలో ధోనీ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో ఎంఎస్ ధోనీ పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ధోనీ ఫిట్ గా ఉన్నాడని, రాబోయే సీజన్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన సీఎస్కే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు. ఇప్పుడు ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టడంతో అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి.