Gautam Gambhir Frustrated Over Costly No Ball Error: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాల్గో రోజు ఆటలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెడుతున్న సమయంలో రవీంద్ర జడేజా వేసిన ఒక నోబాల్ టీమ్ ఇండియాను నిరాశపరిచింది. జడేజా వేసిన బంతి షార్ప్గా టర్న్ అవుతూ లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్లో సులభమైన క్యాచ్గా వెళ్లింది. అయితే ప్లేయర్లు సంబరాలు చేసుకునే లోపే అంపైర్ నోబాల్ సిగ్నల్ ఇచ్చాడు. జడేజా క్రీజు దాటి అడుగు వేయడంతో దక్కాల్సిన కీలక వికెట్ చేజారింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముఖంలో తీవ్ర అసహనం స్పష్టంగా కనిపించింది.
పంత్ చారిత్రక 100 సిక్సర్లు.. ఇండియా 193 పరుగులకు ఆలౌట్తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యం సాధించిన ఇండియా, నాల్గో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (35), దేవదత్ పడిక్కల్ (44) రెండో వికెట్కు 65 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 రన్స్ బాదాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ బ్యాటర్గా పంత్ అరుదైన చరిత్ర సృష్టించాడు. జడేజాతో కలిసి 54 పరుగులు జోడించిన పంత్ అవుటైన తర్వాత మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఇండియా 193 పరుగులకే ఆలౌట్ అయింది.
శ్రీలంక ముందు 372 రన్స్ టార్గెట్.. నాలుగు వికెట్లు డౌన్శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నిలవగా, టీ బ్రేక్ తర్వాత లంక బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు వికెట్లతో మ్యాజిక్ చేయగా, పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
పోరాడుతున్న లంక..ఇక బుధవారం ఐదో రోజు ఆట ప్రారంభమయ్యాక లంక పోరాటం కొననసాగిస్తోంది. దాదాపు గంట సేపు గడిచిన వికెట్ కోల్పోకుండా గట్టి పట్టుదల కనబరుస్తోంది. ముఖ్యంగా ధనంజయ (54 బ్యాటింగ్), సోనాల్ దినుష (43 బ్యాటింగ్) తో సత్తా చాటారు. సోనాల్, అర్థ సెంచరీల వైపు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అబేధ్యమైన ఐదో వికెట్ కు వీరిద్దరూ 83 పరుగులు జోడించారు. మరోవైపు చివరి రోజు విజయానికి భారత్ కు మరో ఆరు వికెట్లు అవసరం ఉంది. వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా లంక ఇన్నింగ్స్ కు ముగింపు పలకాలని భారత ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
