Ishan Kishan Hits Gym Hard With Mumbai Indians Captain Hardik Pandya :  టీమిండియా(Team India) బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan) చాలా రోజుల తర్వాత కనిపించాడు.  రెండు నెలల క్రితం వ్యక్తిగత కారణాలు చెప్పి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన ఇషాన్‌ కిషన్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. కొద్దిరోజులుగా బరోడాలోని టీమిండియా మాజీ ఆటగాడు కిరణ్‌ మోరే అకాడమీలో ఇషాన్‌ శిక్షణ పొందుతున్నాడు. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా( Hardik Pandya), అతడి సోదరుడు కృనాల్‌ పాండ్యా కూడా ఇదే అకాడమీలో ట్రైనింగ్‌ అయ్యారు. మూడు వారాలుగా కిరణ్‌ మోరే అకాడమీలోనే ఉంటున్న ఇషాన్‌.. జిమ్‌లో ట్రైనింగ్‌ అవుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాతో కలిసి ఇషాన్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఇషాన్‌, హార్దిక్‌ ఇద్దరూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కే ఆడుతున్నారు. 


మానసిక కుంగుబాటేనా.?
గత ఏడాదంతా విరామం లేకుండా జట్టుతో ప్రయాణం చేసిన ఇషాన్‌ కిషన్‌.. తుది జట్టులో ఆడింది మాత్రం చాలా తక్కువ. ఎవరైనా అందుబాటులో లేకుంటేనే ఇషాన్‌కు ఛాన్స్‌లు వస్తున్నాయి తప్పితే టీమిండియా తుది జట్టులో కిషన్‌కు పెద్ద అవకాశాలు రావడం లేదు. జట్టులో చోటు దక్కకపోవడంతో ఇషాన్‌కు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నాడని, అందుకే అతడు కొన్నాళ్లు ఆట నుంచి విరామం తీసుకునేందుకు దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ వరకు ఆటకు దూరంగా ఉండాలని ఇషాన్ కిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్ట్‌లతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 29.64 సగటుతో 741 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి. 


బీసీసీఐ ఆగ్రహం
టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI secretary Jay Shah)... తీవ్ర హెచ్చరికలు చేశాడు. గాయమైతే తప్ప.. రంజీ ట్రోఫీ లేదా ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడకపోతే  తీవ్ర పర్యవసనాలు ఉంటాయని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లను, భారత్‌-ఏ స్థాయి ఆటగాళ్లను జై షా హెచ్చరించాడు. ఈ మేరకు క్రికెటర్లకు అతడు లేఖ రాశాడు. జాతీయ జట్టులోకి ఎంపికకు దేశవాళీ క్రికెట్‌ ముఖ్యమైన కొలబద్ద అని షా స్పష్టం చేశాడు. కొందరు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యమిస్తున్నారని.. ఇదా తాము ఊహించలేదని జై షా అన్నాడు.  భారత క్రికెట్‌కు ఎప్పుడూ దేశవాళీ క్రికెట్టే పునాదని గుర్తు చేశాడు.  తామెప్పుడూ దేశవాళీ క్రికెట్‌ను తక్కువగా చూడలేదని కూడా జై షా తెలిపాడు. భారత్‌కు ఆడాలనుకునే ప్రతి ఆటగాడు ముందు దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకోవాలని సూచించాడు. ఆటగాళ్లు దేశవాళీలో ఆడకపోతే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని షా హెచ్చరించాడు. జాతీయ జట్టులో లేకపోయినా ఇషాన్‌ కిషన్‌ రంజీ మ్యాచ్‌ల్లో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జై షా చేసిన తీవ్ర హెచ్చరికలు వైరల్‌గా మారాయి.