IPL 2024 will take place in India: దేశంలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌(IPL) ఎప్పుడు నిర్వహిస్తారా అన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. వేసవిలోనే ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ ఏడాది ఐపీఎల్‌ను వేరే దేశానికి మారుస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి. వీటన్నింటిపై ఇప్పుడు ఓ స్పష్టత వచ్చింది. ఐపీఎల్‌ మార్చి ఆఖరి వారంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఐపీఎల్‌ చైర్మన్‌( IPL chairman) అరుణ్‌సింగ్‌ ధుమాల్‌(Arun Dhumal) బుధవారం ఒక ప్రకటనలో ధృవీకరించారు. ఐపీఎల్ 2024 సీజన్ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయని ధుమాల్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం జనరల్ ఎలక్షన్స్ తేదీలను ఖరారు చేసిన వెంటనే ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదలవుతుందని తెలిపారు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26న ప్రారంభమై మే 26న ముగుస్తుందని తెలుస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్‌తో సంబంధం లేకుండా ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు సన్నాహకాలను మొదలపెట్టేశాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు. 



సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వంతో కలిసి త్వరలో సంప్రదింపులు జరుపుతామని.... ఎన్నికల షెడ్యూల్‌ గురించి వేచిచూస్తున్నామని ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌సింగ్‌ ధుమాల్‌ తెలిపారు.  తేదీలను బట్టి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో దాన్ని అనుసరించి లీగ్‌ షెడ్యూల్‌ను రూపొందించాలనుకుంటున్నామని వెల్లడించారు. 


రంజీ ఆడితేనే ఐపీఎల్‌!
ఐపీఎల్‌(IPL)లో వస్తున్న ఆదరణ, డబ్బుతో యువ క్రికెటర్లు రంజీ మ్యాచ్‌(Ranji Match)లు అంటేనే తమకేం పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంజీలు ఆడడానికి అయిష్టత చూపించిన ఇషాన్‌ కిషన్‌... ఐపీఎల్ ఆడేందుకు మాత్రం రెడీ అవుతున్నాడన్న  వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధమైంది. భారత జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే ఆ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధనతో యువ ఆటగాళ్లు.. ఐపీఎల్‌ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ ఆడాల్సి వస్తుంది. రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్‌ ఆడని ఇషాన్‌ను తుదిజట్టులోకి ఎలా తీసుకుంటామని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రశ్నిస్తోంది. స్వయంగా రాహుల్‌ ద్రావిడ్‌ కూడా రంజీ ఆడాలంటూ ఇషాన్‌కు సూచించాడు. అయితే ద్రవిడ్‌ మాటలను సైతం పెడచెవిన పెట్టిన ఇషాన్‌.. దేశవాలీ టోర్నీలను కాదని ఐపీఎల్‌ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్‌ ప్రవర్తన చూసి అసహనం వ్యక్తం చేసిన బీసీసీఐ పెద్దలు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. బీసీసీఐతో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో పాల్గొనాలని రూల్‌ పాస్‌ చేశారు. 


ధోనీకిది చివరిది కాదా..?
ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ధోనీకిది చివరి ఐపీఎల్‌ కాదని టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్‌ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంఎస్‌ ధోనికి కొన్నిరోజుల కిందట కలిశానని. పొడవాటి జుట్టు పెంచుతూ కెరీర్‌ తొలినాళ్లలతో ఉన్న ధోనిలా తయారవుతున్నాడని ధోనీ తెలిపాడు. 40 ఏళ్లు దాటినా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని... ఫ్రాంఛైజీ కోసం, అభిమానుల కోసం ఇంకొన్ని సీజన్లు ఆడేలా అతడు కనిపిస్తున్నాడని పఠాన్‌ వ్యాఖ్యానించాడు.