Gautam Gambhir: 


లక్నో సూపర్ జెయింట్స్‌ (Lucknow Super Giants) మెంటార్‌ పదవికి గౌతమ్ గంభీర్‌ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. 2024 సీజన్లో ఆయన రెండుసార్లు ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కలిసి పనిచేస్తారని దైనిక్‌ జాగరణ్‌ రిపోర్టు చేసింది. కేకేఆర్‌ (KKR) ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఆయన నిరంతరం టచ్‌లో ఉంటున్నారని తెలిపింది. అసలు ఏం జరుగుతుందో తెలిసేందుకు సమయం పట్టనుంది.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL) గౌతమ్‌ గంభీర్‌కు (Guatam Gambhir) ప్రత్యేక స్థానం ఉంది. మొదట అతడు దిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాడు. 2011 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతడిని 2.4 మిలియన్‌ డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది. రావడం రావడంతోనే అతడు దుమ్మురేపాడు. నాలుగు సీజన్లలో జట్టను నడిపించాడు. 2012, 2014లో ట్రోఫీలు అందించాడు. లీగులో తన పేరుతో రికార్డులు లిఖించాడు. అయితే మూడేళ్ల క్రితం మళ్లీ దిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లాడు. అక్కడ వివాదాస్పద రీతిలో కెప్టెన్సీ వదిలేశాడు.


ఐపీఎల్‌ సహా అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గౌతమ్ గంభీర్‌ 2022 సీజన్లో కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా వెళ్లాడు. తనదైన వ్యూహాలతో వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేశాడు. ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లతో జట్టును నింపాడు. అన్ని బేస్‌లను కవర్‌చేశాడు. వరుసగా రెండుసార్లు ప్లేఆఫ్‌కు తీసుకెళ్లాడు. ప్రస్తుతానికి అంతా హ్యాపీనే! ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో లక్నో మ్యాచ్‌ తర్వాత గంభీర్‌ హోమ్‌ కమింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌గా మారింది.


గౌతమ్ గంభీర్‌ సారథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అద్భుతంగా ఉండేదని అభిమానులు ట్వీట్లు చేశారు. లక్నోను వదిలేసి కేకేఆర్‌కు తిరిగి రావాలని కోరారు. అతడొస్తే జట్టు కచ్చితంగా గాడిలో పడుతుందని నమ్ముతున్నారు. ఈ మధ్యే లక్నో సూపర్‌ జెయింట్స్‌ సపోర్ట్‌ స్టాఫ్‌లో కొన్ని మార్పులు చేసింది. హెడ్‌కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ను తీసుకుంది. ఆండీ ఫ్లవర్‌ను పక్కన పెట్టింది. ఇక స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా మాజీ చీఫ్ సెలక్టర్‌ ఎంఎస్కే ప్రసాద్‌ను ఎంపిక చేసింది. ఇదే సమయంలో గంభీర్‌ లక్నోను వీడుతారని దైనిక్‌ జాగరణ్‌ రిపోర్టు చేయడం గమనార్హం. ఈ వార్తలపై అటు లక్నో, ఇటు గంభీర్‌ స్పందించలేదు.


ప్రస్తుతం గౌతమ్ గంభీర్‌ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఒకవైపు పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. మరోవైపు క్రికెట్‌ మ్యాచులకు కామెంటేటర్‌గా వెళ్తున్నాడు. ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌ మ్యాచులకూ వ్యాఖ్యానం చేయనున్నాడు. కాగా అమెరికాలో జరిగే మాస్టర్స్‌ టీ10 లీగ్‌లో ఆడబోతున్నాడు. యూసుఫ్ పఠాన్‌తో కలిసి న్యూజెర్సీ ట్రైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మాంటీ పనేసర్‌, ఆర్పీ సింగ్‌, ఆల్బీ మోర్కెల్‌, లియామ్‌ ప్లంకెట్‌, జెస్‌ రైడర్‌, క్రెయిగ్‌ మెక్‌మిలన్‌ ఇందులోనే ఆడుతున్నారు.


మాజీ చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కామెంటేటర్‌గా సేవలు అందిస్తున్నారు. అలాగే ఆంధ్రా జట్టుకు క్రికెట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన్ను లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎంపిక చేసింది. అయితే ఆయన ఎక్కువగా స్కౌటింగ్‌పై దృష్టి సారిస్తారని తెలిసింది. ప్రతిభావంతులను గుర్తించడం, వారికి అండదండలు అందించడం, లీగ్‌ ప్రమాణాలకు అందుకొనేలా శిక్షణ ఇవ్వడం ఆయ బాధ్యతలని సమాచారం.


ఇప్పటికైతే లక్నో మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌, హెచ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌, బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌, అసిస్టెంట్‌ కోచ్‌ విజయ్‌ దహియా.


Also Read: విరాట్‌ కోహ్లీ @ 15 ఏళ్లు! వికెట్ల మధ్యే 510 కి.మీ పరుగెత్తిన ఏకైక వీరుడు!