KKR in IPL: ఐపీఎల్‌లో రెండు సార్లు ఛాంపియన్  కోల్‌కతా నైట్ రైడర్స్ నేడు అహ్మదాబాద్ వేదికగా  డిఫెండింగ్ ఛాంపియన్స్  గుజరాత్ జెయింట్స్‌ను ఢీకొననుంది.  ఈ సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్)  పద్ధతిలో  ఓడిన కేకేఆర్..  మూడు రోజుల క్రితం  సొంత  గ్రౌండ్ (ఈడెన్ గార్డెన్) లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చుక్కలు చూపించింది. ఈ విజయంతో బోణీ కొట్టిన  కేకేఆర్‌కు  మరింత జోష్‌ను పంచుతూ  విధ్వంసక ఓపెనర్ జేసన్ రాయ్ నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారని సమాచారం.


వెన్ను గాయంతో ఐపీఎల్ - 16 నుంచి తప్పుకున్న   కేకేఆర్  రెగ్యులర్ కెప్టెన్  స్థానంలో వచ్చిన  ఇంగ్లాండ్ ఆటగాడు జేసన్ రాయ్ ఇదివరకే  జట్టుతో కలిశాడు.  అతడితో పాటుగా  స్వదేశంలో ఐర్లాండ్‌తో టెస్టు ముగిసిన నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ కూడా టీమ్‌తో చేరాడని తెలుస్తున్నది.    నేటి మ్యాచ్‌లో లిటన్ దాస్ సెలక్షన్‌పై అనుమానాలున్నా   రాయ్ అందుబాటులో ఉంటారని  కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. 


 






దాస్ అనుమానమే..! 


గుజరాత్‌తో మ్యాచ్‌కు  లిటన్ దాస్ కూడా అందుబాటులో ఉంటాడని  కేకేఆర్ అభిమానులు భావిస్తున్నా అతడికి ఇంకా  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వలేదని తెలుస్తున్నది.  నేడో రేపో  ఆ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత అతడు నేరుగా   కేకేఆర్ టీమ్‌తో చేరతాడని సమాచారం. గుజరాత్‌తో మ్యాచ్‌లో అతడు ఆడేది అనుమానమే అయినా  ఈనెల 14న ఈడెన్ గార్డెన్ లో  సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్‌కు మాత్రం అతడు ఆడతాడని తెలుస్తున్నది.  


 






మన్‌దీప్ ఔట్..?  


ఈ మ్యాచ్ లో జేసన్ రాయ్ ఆడటం ఖాయమే. గత రెండు మ్యాచ్‌లలో కేకేఆర్‌కు  మంచి ఆరంభాలు దక్కలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ రెహ్మనుల్లా గుర్బాజ్  గత రెండు మ్యాచ్ లలో (22, 57) రాణించినా అతడికి  తోడుగా  నిలిచేవారే కరువయ్యారు. పంజాబ్ తో మ్యాచ్ లో  గుర్బాజ్ కు తోడుగా వచ్చిన మన్‌దీప్ సింగ్ 2 పరుగులకే ఔటయ్యాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.  దీంతో  నేటి మ్యాచ్‌లో అతడికి అవకాశం దక్కేది అనుమానమే.  మన్‌దీప్ స్థానంలో  రాయ్‌ను తీసుకుని  గుర్బాజ్ తో కలిసి ఓపెనింగ్ చేయించేందుకు  కేకేఆర్ ప్రణాళికలు సిద్ధం చేసింది.  


వాళ్లు రాణించడం కీలకం.. 


గుజరాత్‌తో మ్యాచ్‌కు  రాయ్ వచ్చినా  కేకేఆర్ బ్యాటింగ్ లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  కెప్టెన్ గా బరిలోకి దిగుతున్న నితీశ్ రాణా  గత రెండు మ్యాచ్ లలో  25 (24, 1)  పరుగులే చేశాడు.  వెంకటేశ్ అయ్యర్  పంజాబ్ తో మ్యాచ్ లో ఫర్వాలేదనిపించినా బెంగళూరుతో  పోరులో  విఫలమయ్యాడు.  ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్   కూడా బ్యాట్ ఝుళిపిస్తేనే  కేకేఆర్ కు భారీ స్కోరు సాధ్యమవుతుంది.   గత మ్యాచ్‌లో  శార్దూల్ ఠాకూర్  (68)  మెరుపులకు తోడు రింకూ సింగ్ (46) పుణ్యమా అని గట్టెక్కిన  కేకేఆర్ మరోసారి  వారిపైనే భారీ ఆశలు పెట్టుకుంది.   అయితే వీరికి తోడు మిగిలిన బ్యాటర్లు కూడా  స్థాయికి తగిన ప్రదర్శన చేస్తేనే   కోల్‌కతా.. జీటీ ఎదుట భారీ  స్కోరు నిలపగలుగుతుంది.