Kohli vs Gambhir IPL Fight: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ - మాజీ ఓపెనింగ్ బ్యాటర్ గౌతం గంభీర్‌లు మరోసారి  వార్తల్లోకెక్కారు. ఈ ‘ఢిల్లీ బాయ్స్’కు వాగ్వాదాలు కొత్తేమీ కాకపోయినా నిన్న రాత్రి జరిగేది మాత్రం ఐపీఎల్ స్ఫూర్తికే విరుద్ధంగా ఉంది. ‘ఏదో ఇప్పుడే ఆటలోకి వచ్చినోళ్లు, ఉడుకు రక్తంతో  వాదులాడుకున్నారు’ అని సర్ది చెప్పుకోవడానికి వాళ్లేమీ  కుర్రాళ్లు కాదు.  15 ఏండ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ లో వందలాది మ్యాచ్‌లు ఆడినవాళ్లు. అనుభవం ద్వారా వచ్చిన పరిణితి ఆటగాళ్లను ఆటతో పాటు మానసికంగా మరింత రాటు దేల్చాలి గానీ  ఈ ఇద్దరికీ మాత్రం ‘చదివేస్తే ఉన్నమతి పోయింది’ అన్న చందంగా తయారైంది పరిస్థితి. ‘వాయిలెన్స్ వాళ్ల డీఎన్‌ఎ’లోనే ఉందన్న  అరవింద సమేత సినిమాలోని డైలాగ్ ను గుర్తు చేస్తూ వీళ్ల గొడవలు ఆది నుంచి నేటి వరకూ సవివరంగా...


అప్పుడు మొదలైంది.. 


కోహ్లీ - గంభీర్‌ల గొడవ  ఇప్పటిది కాదు.  అదేదో సినిమాలో ఐదు రూపాయల ఫ్యాక్షన్ అంటూ రెండు తరాలుగా   కొట్లాటలు చూపించినట్టు  ఈ ఇద్దరి మధ్య  కూడా  వాదులాడుకోవడాలు మొదలై పదేండ్లు దాటింది. వాస్తవానికి కోహ్ల - గంభీర్ లు ఒకే రాష్ట్రానికి (ఢిల్లీ)కి చెందినవారే. కలిసి దేశవాళీ క్రికెట్ తో పాటు జాతీయ జట్టులో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నవాళ్లే. కానీ  2013లో ఇదే ఐపీఎల్  ఆరో సీజన్‌లో ఆర్సీబీ - కేకేఆర్ మధ్య  చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ గొడవకు బీజం పడింది. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తుండగా పదో ఓవర్లో లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ లో  కోహ్లీ ఔటయ్యాడు.  కోహ్లీ ఔట్ కాగానే గంభీర్ కాస్త అతిగా  సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది కోహ్లీకి కాలింది. ఇద్దరూ ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకునే స్థాయికి వచ్చారు. చివరికి కేకేఆర్ ఆటగాళ్లు, అంపైర్ సర్ధి చెప్పడంతో ఈ గొడవ సద్దుమణిగింది. 


 






2016లో ఇదే లొల్లి.. 


ఇదే ఐపీఎల్ లో 2016 సీజన్ లో  ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ - ఆర్సీబీ మ్యాచ్.  183 పరుగుల లక్ష్య ఛేదనలో  ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో  19 ఓవర్లో  కోహ్లీ  పరుగు తీసి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో నిల్చున్నాడు.   అప్పటికే పరుగుతీసిన కోహ్లీపై గంభీర్ కోపంగా బంతిని విసిరాడు. అది కాస్తా అతడికి తాకింది. ఖతం.. మళ్లీ గొడవ షురూ.. 


ఈ ఏడాది ఇలా.. 


గంభీర్ - కోహ్లీల వ్యక్తిగత  గొడవ కాస్తా   ఈ ఇద్దరూ ఏ టీమ్ లో ఉంటే ఆ టీమ్స్ మధ్య  గొడవలా అయిపోయింది. ఈ ఏడాది  ఐపీఎల్ -16లో  భాగంగా కొద్దిరోజుల క్రితం ఆర్సీబీ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బెంగళూరులో మ్యాచ్ జరుగగా ఈ మ్యాచ్ లో లక్నో గెలిచింది. గెలిచాక గంభీర్  చిన్నస్వామిలో అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘నోర్మూసుకోండి’అన్నట్టుగా సంజ్ఞ చేశాడు. ఇది ఆర్సీబీ ఏ మేరకు గుర్తుంచుకుందో లేదో గానీ కోహ్లీ మాత్రం రివేంజ్ కు ఫిక్స్ అయ్యాడు.  అందుకు వేదిక కూడా సిద్ధమైంది. సోమవారం లక్నోతో మ్యాచ్  లో ఫ్యాన్స్ అరుస్తుండగా  గంభీర్ చెప్పినట్టుగానే దానికి కాస్త కోహ్లీ అటిట్యూడ్ టచ్ ను యాడ్ చేస్తూ సంజ్ఞలు చేశాడు.


 






సరే రివేంజ్ తీర్చుకున్నాడు.. ఇక్కడికైనా ఆగిపోయిందా..? అంటే అదీలేదు.   మ్యాచ్ ముగిశాక కోహ్లీ.. లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్ తో ఏదో మాట్లాడబోతుంటే గంభీర్ వచ్చి అతడిని ‘హే, ఛీ.. వాడితో మాట్లాడతావా..?’ అన్నట్టుగా అక్కడ్నుంచి అతడిని తీసుకుపోయాడు. ఇది కోహ్లీకి మండింది. మళ్లీ లొల్లి మొదలు..! కట్ చేస్తే, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇద్దరూ  బీసీసీఐ  ఆగ్రహానికి   గురయ్యారు. 


ఇదేనా అనుభవం..!


గంభీర్ భారత జట్టు తరఫున 2003 నుంచి  2016 దాకా ఆడాడు.  అంటే  13 ఏండ్లు  భారత జట్టుకు సేవలందించాడు.  కోహ్లీ 2008 నుంచి ఆడుతున్నాడు.  అతడు వచ్చి కూడా 15 ఏండ్లు గడిచాయి. ఇద్దరూ భారత జట్టుకు కలిసి ఆడారు. ఈ  పదిహేనేండ్లలో ఈ ఇద్దరూ  2013 తర్వాత ఎదురుపడ్డప్పుడల్లా ఏదో ముభావంగా ఉండటమే  తప్ప  మనస్పూర్తిగా మాట్లాడుకున్నారంటే అది అతిశయోక్తే. ఆటలో భావోద్వేగాలు సహజం.  దూకుడు స్వభావం ఉన్న ఆటగాళ్లకు ఇది ఇంకొన్ని పాలు ఎక్కువే. కానీ   క్రీడా స్ఫూర్తి అని లెక్చర్లు దంచేప్పుడైనా ఈ ఘటనలు గుర్తుకురావా..?  కోహ్లీ  టీమిండియా, ఆర్సీబీ బ్యాటింగ్ కు పిల్లర్ వంటి వాడు. గంభీర్ లక్నోకు మెంటార్, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ.  వీళ్లిద్దరూ భవిష్యత్  క్రికెటర్లకు చెబుతున్నదేమిటి..?  ఏండ్లకేండ్లు గొడవపడమనేనా..? తగ్గితే తప్పేమి..!