Visakhapatnam Stadium Records: హైదరాబాద్‌(Hyderabad)లో జరిగిన తొలిటెస్టులో ఇంగ్లాండ్‌(England) చేతిలో ఓటమి చవిచూసిన భారత జట్టు...విశాఖపట్నం(Visakhapatnam) వేదికగా నేటి నుంచి జరిగే రెండో టెస్టు కోసం సిద్ధమైంది. తొలిటెస్టులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న టీమిండియాను గాయాలు సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు గాయాల కారణంగా KL రాహుల్‌, రవీంద్ర జడేజా దూరమయ్యారు. మూడేళ్ల క్రితం కూడా చెన్నైలో ఇంగ్లాండ్‌ చేతిలో తొలిటెస్టు ఓడిన టీమిండియా ఆ తర్వాత విజయాల బాటపట్టి టెస్టు సిరీస్‌ సొంతం చేసుకుంది. ఐతే ఈసారి జోరూట్‌ సేన నుంచి రోహిత్‌ సేన గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అయితే విశాఖలో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే...



వైజాగ్‌లో భారత రికార్డు ఇలా..
భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం( ACA-VDCA Cricket Stadium) వేదికగా జరగనుంది. ఇక్కడ గతంలో రెండు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే వైజాగ్ పిచ్‌పై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది.  ఈ రెండు మ్యాచుల్లో ఒకటి ఇంగ్లండ్‌తో, మరొకటి సౌతాఫ్రికాతో ఆడింది. వైజాగ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో సారధి రోహిత్ శర్మ, అశ్విన్‌కు మంచి రికార్డులున్నాయి. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 246 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.  ఈ మ్యాచ్‌లో కోహ్లీ భారీ సెంచరీ చేసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అశ్విన్ 8 వికెట్లతో సత్తా చాటాడు. 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో మ్యాచ్‌లో కూడా భారత జట్టు అదరగొట్టింది. 203 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో దుమ్ములేపాడు. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 7 వికెట్లు తీశాడు. హిట్‌మ్యాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వైజాగ్‌లో జరిగిన రెండు టెస్టుల్లోనూ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. వైజాగ్‌లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 479కాగా.. అత్యధిక స్కోర్ 502. అత్యల్ప స్కోర్ 158. విశాఖలో జరిగిన టెస్టుల్లో స్పిన్నర్లు 47 వికెట్లు తీయగా.. పేసర్లు 23 వికెట్లు తీశారు. 


500 వికెట్ల క్లబ్‌లో చేరుతాడా..?
ఈ మ్యాచులో అశ్విన్ మ‌రో నాలుగు విక‌ట్లు తీస్తే.. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 96 టెస్టుల్లో 496 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు ప్రద‌ర్శన 34 సార్లు న‌మోదు చేశాడు. రెండో టెస్టు మ్యాచులో రెండు వికెట్లు తీసినా అశ్విన్‌ మరో రికార్డు సృష్టిస్తాడు. ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా అశ్విన్‌ కొత్త చరిత్ర లిఖిస్తాడు. ఇప్పటి వ‌ర‌కు ఈ ఘ‌న‌త చంద్రశేఖ‌ర్ పేరిట ఉంది. చంద్రశేఖ‌ర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌రువాత రెండో స్థానంలో అశ్విన్ ఉన్నాడు. అశ్విన్‌ 37 ఇన్నింగ్స్‌ల్లో 94 వికెట్లు సాధించాడు. వీరిద్దరి త‌రువాత మూడో స్థానంలో అనిల్ కుంబ్లే 92 వికెట్లతో ఉన్నాడు.