భార‌త యువ క్రికెట‌ర్(Indian Cricketer) , ఆల్‌రౌండర్‌ వెంక‌టేశ్ అయ్యర్( Venkatesh Iyer) అభిమానులుకు శుభవార్త చెప్పాడు. తాను త్వర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు ప్రకటించాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) లో కోల్ కతా నైట్ రైడర్స్(kolkata knight riders) తరపున ఆడుతూ పాపుల‌ర్ అయిన అయ్యర్.. శృతి ర‌ఘునాథ‌న్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అయ్యర్‌ స్వయంగా ప్రకటించాడు. తనకు నిశ్చితార్థమైన విషయాన్ని తెలియజేస్తూ కాబోయే శ్రీమతితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వీరిద్దరి నిశ్చితార్థం క‌న్నుల‌పండువ‌గా జ‌రిగింది. ఇరువురి కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక జరిగింది. అయ్యర్, శృతి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.


త‌న జీవితంలోని ముఖ్యమైన ఈ సంద‌ర్భాన్ని అయ్యర్ సోష‌ల్‌మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. తన జీవితంలో తదుపరి అధ్యాయానికి నాంది అంటూ అయ్యర్‌ ఇన్‌స్టా, స్నాప్‌చాట్ అకౌంట్‌ల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వెంకటేశ్‌ అయ్యర్‌కు కాబోయే భార్య పేరు శృతి రఘునాథన్‌. పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో బీకామ్‌ చదివిన శృతి.. నిఫ్ట్‌ నుంచి ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకుంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తోంది.


అయితే వివాహ వేడుక ఎప్పుడూ జరుగుతుందనే విషయాన్ని మాత్రం వెంకటేష్ అయ్యర్ కానీ, అతని కుటుంబసభ్యలు కానీ వెల్లడించలేదు. కాకపోతే త్వరలోనే వివాహం కూడా జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ అయ్యర్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యకుమార్‌ యాదవ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ సహా హర్‌ప్రీత్‌ బ్రార్‌ వెంకటేశ్‌-శృతికి శుభాకాంక్షలు తెలిపారు. 


మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ఇండోర్‌లో జన్మించిన వెంకటేశ్‌ అయ్యర్‌.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో 2021లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగ్రేటం చేశాడు. వెంకటేష్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. 2021లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. కోల్‌కత నైట్ రైడర్స్‌కు సెలెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచీ జట్టులో ఆల్ రౌండర్‌గా కీలక పాత్ర పోషిస్తోన్నాడు. 28 ఏళ్ల వెంకటేష్ అయ్యర్‌కు ప్రస్తుతం భారత జట్టులో చోటు లేకపోయినప్పటికీ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో వెంకటేష్ అయ్యర్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. భారత జట్టు తరఫున ఇప్పటివరకు 2 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్‌లో 36 మ్యాచ్‌లాడాడు. 28 సగటుతో 956 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలున్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు 104. బ్యాటింగ్ యావరేజ్ 28.12. 130. 25 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు.  టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు.


ఈ ఏడాది జరిగిన ఐపీఎఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి ల145.85 స్ట్రైక్ రేట్‌తో 404 పరుగులు చేశాడు. అయ్యర్‌ను వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ రిటైన్ చేసే అవకాశం ఉంది. డిసెంబ‌ర్ 19న ఐపీఎల్ వేలం నిర్వహించ‌బోతున్నారు.