India vs West Indies: సుమారు రెండున్నర  శతాబ్దాల  క్రికెట్ చరిత్రలో  భారత జట్టుకు కూడా వందేళ్ల ఘన చరిత్ర ఉంది. అధికారికంగా భారత జట్టు టెస్టు మ్యాచ్  1932లో ఆడినా  అంతకుముందు  బ్రిటీషర్ల పాలనలో ఇక్కడ స్థానికంగా టోర్నీలు జరిగాయి.  భారత్‌తో పాటే వెస్టిండీస్‌కు కూడా  క్రికెట్‌లో ఘనమైన చరిత్రే ఉంది. 1926లోనే ఐసీసీ సభ్యత్వాన్ని సాధించిన ఆ జట్టు అధికారికంగా టెస్టు మ్యాచ్‌ను 1928లో ఆడింది.   ప్రపంచ క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న భారత్ - వెస్టిండీస్‌లు త్వరలో జరుగబోయే  రెండో టెస్టుతో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాయి. 


ఈనెల 20 నుంచి  పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ ఓవల్ పార్క్ వేదికగా జరుగబోయే భారత్ - వెస్టిండీస్ రెండో టెస్టు.. ఈ ఇరు జట్ల మధ్య వందో టెస్టు కానుంది.   1948 నుంచి  మొదలైన భారత్ - వెస్టిండీస్ జట్ల టెస్టు సమరం..  మరో మూడు రోజుల్లో సెంచరీ కొట్టబోతుంది.  ప్రస్తుతం   మారిన దేశ కాలమాన పరిస్థితుల వల్ల  భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటే  అభిమానులు ఎగబడుతున్నారు గానీ.. దాయాదుల మధ్య కూడా ఇన్ని మ్యాచ్‌లు జరుగలేదనేది గణాంకాలు వెల్లడిస్తున్న  కఠోర  వాస్తవం. 


టీమిండియా టెస్టులలో వందకు పైగా టెస్టులు ఆడిన జట్లు ఇప్పటివరకూ రెండే రెండు. అందులో ఒకటి ఇంగ్లాండ్, మరోకటి ఆస్ట్రేలియా.  ఈ రెండు జట్ల తర్వాత  భారత్.. అత్యధికంగా ఇప్పటివరకూ 99 టెస్టులను వెస్టిండీస్‌తో ఆడింది.   ఇప్పుడంటే వెస్టిండీస్  జట్టు బలహీనపడింది గానీ 1960-80‌ల మధ్యకాలంలో ఆ జట్టు వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది.  వెస్టిండీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి, బ్యాటర్లకు అడ్డుకట్ట వేయడానికి  ప్రత్యర్థి జట్లు నానా తంటాలు పడేవి. 


భారత్ అత్యధికంగా టెస్టులు ఆడిన దేశాలు.. 


1. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ : 131 టెస్టులు 
2. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా : 107 టెస్టులు 
3. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ : 99 టెస్టులు 
4. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ : 62 టెస్టులు 
5. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ : 59 టెస్టులు 


 






వెస్టిండీస్‌తో 99 టెస్టులు ఆడిన భారత జట్టుపై..ఇప్పటికీ వెస్టిండీస్ ఆధిపత్యమే ఉంది. విండీస్ జట్టు 30 మ్యాచ్‌లలో విజయాలు సాధించగా  భారత జట్టు 23 మ్యాచ్‌లు గెలుచుకుంది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.  


1948 నుంచి మొదలు.. 


భారత్ - వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ 1948లో జరిగింది.   భారత పర్యటనకు వచ్చిన కరేబియన్ జట్టు.. ఆ పర్యటనలో ఐదు టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌లు  డ్రా గా ముగియగా సిరీస్‌లో నాలుగో టెస్టును వెస్టిండీస్ గెలుచయుకుంది. భారత జట్టు తొలిసారి 1952-53లో విండీస్ దీవులకు వెళ్లింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో కూడా 1-0తేడాతో కరేబియన్ జట్టే విజయం సాధించింది. కానీ 2002 తర్వాత ఇండియా, వెస్టిండీస్‌లలో జరిగిన ఏ టెస్టు సిరీస్‌లో కూడా టీమిండియా ఓడిపోలేదు. 21 ఏండ్లుగా భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial