మరికాసేపట్లో ప్రపంచం స్తంభించపోనుంది. క్రికెట్‌ మహా సంగ్రామంలో భారత్-పాక్‌ కాసేపట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానమైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానం లక్షా 32 వేల మంది ప్రేక్షకులతో మార్మోగనుంది. ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై కాలుమోపిన పాకిస్థాన్‌.. భారత్‌పై స్వదేశంలో విజయం సాధించాలని భావిస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి అభిమానులు కూడా సిద్ధమైపోయారు. ప్రపంచకప్‌లోనే  హైఓల్టేజీ మ్యాచ్‌ అయిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భీకర పోరు జరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు తలపడితే ప్రతీసారి భారత్‌నే విజయం వరించి ఉండవచ్చు. కానీ పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బలాబలాలు, ఇటీవలి ప్రదర్శన చూసినా రోహిత్‌ సేనే ఫేవరెట్‌ కావచ్చు. కానీ దాయాది జట్టులోనూ ఆట స్వరూపాన్ని మార్చే ఆటగాళ్లకు కొదవలేదు. అయితే ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ను ఎలా చూడాలి.. అసలు మ్యాచ్‌ ఏ సమయానికి ప్రారంభమవుతుంది... ఫోన్‌లో ఫ్రీగా చూడొచ్చా... మ్యాచ్ ఎన్ని గంటలకు...ఈ వివరాలు మీకోసం 

 

మ్యాచ్ ఎన్ని గంటలకు...

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది. 1:30కు టాస్‌ వేస్తారు.

 

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ..

 భారత్‌-పాక్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

 

ఫోన్‌లో ఉచితంగా..

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఉచితంగా చూడొచ్చు.

 

ప్రపంచకప్‌ తాజా స్కోరు కోసం

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ తాజా స్కోర్, అప్‌డేట్‌ల కోసం news.abplive.com/sportsని చూస్తూ ఉండండి

ఈ ప్రపంచకప్‌లోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు రణ క్షేత్రం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్‌ లోకమే ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ వేదికపై చిరకాల ప్రత్యర్థులు అమితుమీ తేల్చుకోనున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య పోరును సాధారణ మ్యాచ్‌ల కాకుండా ఇరు దేశాల అభిమానలు ఓ యుద్ధంలా చూస్తారు. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు కనురెప్ప ఆర్పకుండా ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తారు. ప్రపంచకప్‌లో తమ తొలి రెండు మ్యాచ్‌లలో ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్‌లపై భారత్‌ భారీ విజయం సాధించగా... నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించిన పాక్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇటీవలి ఆసియా కప్‌ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో భారత్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా ఆడే పాక్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

 

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్

 

పాకిస్థాన్ జట్టు:

బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది , మహ్మద్ వాసిం.