IND vs NZ ODI:  భారత్ తో రెండో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఒక మార్పు చేసింది. ఆడమ్ మిల్నే స్థానంలో మైఖెల్ బ్రేస్ వెల్ ను తీసుకుంది. ఇప్పటిదాకా పిచ్ కవర్లతో కప్పి ఉంది. కాబట్టి సీమర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నాను. మా పేసర్లు శుభారంభం ఇస్తారని ఆశిస్తున్నాను. అని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అన్నాడు. 


తాను టాస్ గెలిస్తే ముందు బౌలింగే ఎంచుకునే వాళ్లమని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ చెప్పాడు. అయితే సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేస్తామని అన్నాడు. భారత్ రెండు మార్పులు చేసింది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్, సంజూ శాంసన్ స్థానంలో దీపక్ హుడా జట్టులోకి వచ్చారు.






 



భారత్- న్యూజిలాండ్ రెండో వన్డేకి ఆటగాళ్లు సిద్ధమయ్యారు. తొలి వన్డేలో భారీ స్కోరు చేసినప్పటికీ టీమిండియా ఓటమి చవిచూసింది. టామ్ లేథమ్ అద్భుత ఇన్నింగ్సుతో భారత్ కు పరాజయాన్ని మిగిల్చాడు. సిరీస్ ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా తప్పక గెలవాల్సిందే. మరోవైపు సొంతగడ్డపై కివీస్ జోరు మీద ఉంది. స్వదేశంలో వరుసగా 13 వన్డేలు గెలిచింది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న న్యూజిలాండ్ ను ఓడించాలంటే భారత్ శక్తి మేర రాణించాల్సిందే. 


బ్యాటింగ్ ఓకే


బ్యాటింగ్ లో భారత్ బలంగానే కనిపిస్తోంది. తొలి వన్డేలో ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. శ్రేయస్, సంజూ శాంసన్ లు ఇన్నింగ్స్ ను నిర్మించారు. అయితే మిడిలార్డర్ లో పంత్, సూర్యలు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. పంత్ వైఫల్యం వన్డేల్లోనూ కొనసాగుతోంది. సూర్య వన్డేల్లో రాణించాల్సిన అవసరముంది.  టీ20ల్లో ఛాన్స్ రాని సంజూ శాంసన్ మొదటి వన్డేలో బాగానే ఆడాడు. అయితే స్కోరు వేగం పెంచాల్సిన సమయంలో ఔటయ్యాడు. ఇక ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటర్లంతా సమష్టిగా చెలరేగితే భారీ స్కోరు చేయడం ఖాయమే. 


బౌలింగ్ మెరుగుపడేనా!


బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవడం భారత్‌కు చాలా అవసరం. తొలి వన్డేలో 300పై లక్ష్యాన్ని కూడా మన బౌలర్లు కాపాడలేకపోయారు. ఈ ఫార్మాట్లో ఏళ్లుగా భారత్‌పై నిలకడగా రాణిస్తోన్న లేథమ్‌, విలియమ్సన్‌లను కట్టడి చేయడానికి వాళ్లు మార్గాలను అన్వేషించాల్సిన అవసరముంది. యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ 145 కిలోమీటర్ల పై వేగంతో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్‌ స్వింగ్‌ చేసే సామర్థ్యమున్నా పేస్‌తో ఇబ్బందిపడ్డాడు. శార్దూల్‌ ఠాకూర్‌ లయ తప్పాడు. స్పిన్నర్‌ చాహల్‌ కూడా పుంజుకోవాల్సివుంది. ఇక ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం లేకపోవడం భారత్‌కు సమస్యగా మారింది. ఆక్లాండ్‌లో ఆడిన టాప్‌-6 బ్యాటర్లలో ఒక్కరూ బౌలింగ్‌ చేయలేరు. ఈ నేపథ్యంలో ఆరో బౌలర్‌ సమస్యను అధిగమించడానికి టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడాను తీసుకునే అవకాశముంది. కానీ అలా చేస్తే ఒక బ్యాటర్‌ను తప్పించాల్సివుంటుంది. శార్దూల్‌ స్థానంలో దీపక్‌ చాహర్‌ జట్టులోకి రావొచ్చు. 


జోరు మీద కివీస్


మరోవైపు న్యూజిలాండ్‌ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై విజయపరంపరను కొనసాగించాలనుకుంటోంది. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ లాంటి బ్యాటర్లను అడ్డుకోవడం కష్టమే. బౌలింగ్ లోనూ కివీస్ మెరుగ్గానే కనిపిస్తోంది. ఓపెనర్లు శతక భాగస్వామ్యం అందించినప్పటికీ న్యూజిలాండ్ బౌలర్లు అంత వేగంగా పరుగులు ఇవ్వలేదు. అలాగే మధ్య ఓవర్లలో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశారు. దాంతో ఇంకా ఎక్కువ స్కోరు చేసే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. సౌథీ, మిల్నే, హెన్రీ, ఫెర్గూసన్ లు ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగాన్ని మోయనున్నారు. 


పరుగుల వరదే..


రెండో వన్డేలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. మ్యాచ్‌ వేదిక సెడాన్‌ పార్క్‌ 2020 నుంచి 3 వన్డేలకు మాత్రమే ఆతిథ్యమిచ్చింది. రెండుసార్లు 330పై స్కోరు వచ్చాయి. ఓ మ్యాచ్‌లో భారత్‌ 347 పరుగులు సాధించింది. వర్షం వల్ల ఆటకు అంతరాయాలు కలిగే అవకాశముంది.


న్యూజిలాండ్ తుది జట్టు:


 ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖెల్ బ్రేస్ వెల్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్.


భారత తుది జట్టు:


శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్), దీపక్ హుడా , వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.