Gujarat Election 2022:  గుజరాత్ లోని జామ్ నగర్ ప్రజలు ప్రస్తుతం క్రికెటర్ రవీంద్ర జడేజాను తరచుగా చూస్తున్నారు. అయితే ఈ ఆల్ రౌండర్ ను వారు మైదానంలో కాకుండా తమ గల్లీల్లో వీక్షిస్తున్నారు. జడేజా భార్య రివాబా ఆ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తరఫున జడేజా ప్రచారం చేస్తున్నారు. 


భార్య తరఫున ప్రచారం


ఆసియా కప్ సందర్భంగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయపడ్డాడు. దీంతో ఆ టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. టీ20 ప్రపంచకప్ నకు అందుబాటులో లేదు. సెప్టెంబరులో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ఈ ఆల్ రౌండర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే వచ్చే నెలలో బంగ్లాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు సెలెక్టర్లు అతన్ని పరిగణనలోకి తీసుకోలేదు. జామ్ నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న తన భార్య రివాబా తరఫున జడేజా ప్రస్తుతం ప్రచారం చేస్తున్నాడు. రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా మెకానికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు. 2019లో బీజీపీలో చేరారు. ఇప్పుడు ఆమె జామ్ నగర్ లో బీజీపీ తరఫున పోటీ చేస్తుండగా.. జడేజా సోదరి నైనాబా కూడా అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీలో నిలబడ్డారు. 


రివాబా పోటీ చేస్తున్న జామ్ నగర్  క్రికెటర్ల భూమిగా ప్రసిద్ధి. భారత దేశవాళీలో ముఖ్యమైన టోర్నీ రంజీ ట్రోఫీ. దానికి ఆ పేరును అదే నియోజకవర్గానికి చెందిన క్రికెటర్ కే.ఎస్. రంజిత్ సిన్హీ గౌరవార్ధం పెట్టారు. ఆయన 1907 నుంచి 1933 వరకు భారత రాచరిక రాష్ట్రమైన నవనగర్ చక్రవర్తిగా ఉన్నారు. అలానే వినూ మన్కడ్, సలీమ్ దురానీ, దులీప్ సిన్హీ వంటి క్రికెటర్లు అక్కడినుంచి వచ్చారు. 






 


రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ జామ్‌నగర్ నార్త్ విధానసభ స్థానం టికెట్‌ను ఆమెకు ఇచ్చినట్లు ఇటీవలే ప్రకటించింది. రివాబా 2019లోనే భాజపాలో చేరారు.


జామ్‌నగర్ నార్త్ గుజరాత్ అసెంబ్లీ సీటును భాజపా.. అంతకుముందు ధర్మేంద్రసింగ్ జడేజాకు ఇచ్చింది. రివాబా 2016లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. ఆమె మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆమె కాంగ్రెస్ నాయకుడు హరిసింగ్ సోలంకీకి బంధువు.


అక్క కూడా


జడేజా భార్య రివాబా పోటీచేస్తున్న స్థానానికి.. జడేజా అక్క నైనా కూడా పోటీపడుతున్నారు. అయితే ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. రివాబా భాజపా నుంచి బరిలోకి దిగితే నైనాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో జడేజా తన భార్యకు మద్దతిస్తాడా లేక అక్క తరఫున ప్రచారం చేస్తాడో చూడాలని చాలా వార్తలు వచ్చాయి. కానీ జడేజా చివరికి.. భార్య రివాబా తరఫునే ప్రచారం చేస్తున్నాడు.