IND vs IER 3rd T20: 


భారత్‌, ఐర్లాండ్‌ మూడో టీ20 టాస్‌ ఆలస్యమైంది. ఈ మ్యాచుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. చాలా సేపటి నుంచి డబ్లిన్‌లో కుండపోతగా వర్షం కురుస్తోంది. చిరు చినుకులతో మొదలైన వాన సమయం గడిచేకొద్దీ పెరుగుతోంది. ప్రస్తుతానికైతే జల్లులు తగ్గే అవకాశం కనిపించడం లేదు.


భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ టాస్‌ రాత్రి 7 గంటలకు వేయాలి. కానీ వర్షం కురుస్తుండటంతో ఆలస్యమైంది. మూడు టీ20 సిరీసును టీమ్‌ఇండియా ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. నేటి పోరులో గెలిచి 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయాలని భావించింది. అయితే వరుణుడు కరుణిస్తేనే ఈ ఘనత సాధ్యమవుతుంది.




ఈ సిరీసులో మొదటి మ్యాచుకూ వరుణుడు అంతరాయం కలిగించాడు. మొదట ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ చేసింది. టీమ్‌ఇండియా ఛేదనకు దిగాక వర్షం మొదలైంది. దాంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆధిక్యంలో ఉన్న బుమ్రా సేనను విజయం వరించింది. ఇక రెండో మ్యాచులో కుర్రాళ్లు అదరగొట్టారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధశతకం బాదేశాడు. సంజూ శాంసన్‌, రింకూ సింగ్‌, శివమ్‌ దూబె బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు.


గాయాల నుంచి కోలుకొని తిరిగొచ్చిన జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ సైతం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పేసుగుర్రం బుమ్రా తన మునుపటి ఫామ్‌ను కొనసాగుతున్నాడు. మంచి లయతో బౌలింగ్‌ చేస్తున్నాడు. చురకత్తుల్లాంటి బంతులు విసురుతున్నాడు. అలాగే పాదాలు చిట్లేలా యార్కర్లు సంధిస్తున్నాడు.


ఇక ఇస్రో సాధించిన విజయాన్ని టీమ్‌ఇండియా సెలబ్రేట్‌ చేసుకుంది. విక్రమ్‌ ల్యాండర్ చంద్రుడి మీదకు దిగుతున్న అపురూప సన్నివేశాలను వీక్షించింది. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయానికి గాను ఆటగాళ్లు అభినందనలు తెలియజేశారు. కుర్రాళ్లంతా టీవీ దిగ్గరే నిలబడి ల్యాండింగ్‌ వీడియోను చూశారు. మిషన్‌ సక్సెస్‌ఫుల్‌ అని చెప్పగానే ఎగిరి గంతులు వేశారు. చప్పట్లు చరిచారు. ఆ తర్వాత మిఠాయిలు పంచారు.