India vs England 5th Test Updates: ధర్మశాల(Dharmashala) వేదికగా భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య చివరిదైన ఐదోటెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 3-1తో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్న టీమిండియా చివరి మ్యాచ్‌లో కూడా నెగ్గి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. టీమిండియా వెటరన్ స్పిన్నర్‌ అశ్విన్‌, ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాటర్‌ బెయిర్‌స్టోలకు ఇది వందో టెస్టు కావడంతో అందరి దృష్టి వీరిపై నెలకొంది.


ఆఖరి టెస్టులోనూ జోరు కొనసాగిస్తుందా?
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌లో దూకుడు మీదున్న ఉన్న టీమిండియా ఆఖరి టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌ చివరిదైన ఐదో టెస్టులో విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఓడిపోతే WTC పాయింట్‌ పట్టికలో..భారత్‌ అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉండడంతో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా ధర్మశాల పిచ్‌ మొదట సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ సాగే కొద్ది స్పిన్నర్ల ప్రభావం కనిపిస్తుంది. 2017లో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. ధర్మశాల పిచ్‌ వన్‌ సైడెడ్‌గా ఉండదని రెండు జట్లకు అనుకూలిస్తుందని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.



అశ్విన్‌ కెరీర్‌లో మైలురాయి
ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి వందో టెస్టు ఆడుతున్న వెటరన్‌ స్పిన్నర్‌ ఆర్‌. అశ్విన్‌పై నెలకొంది. దశాబ్దకాలంగా జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అశ్విన్‌  కెరీర్‌లో మైలురాయి అయిన వందో టెస్టులో రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో అదరగొడుతున్న జైస్వాల్‌తో ఎప్పటిలాగే రోహిత్‌ ఓపెనింగ్‌ చేస్తాడు. శుభమన్‌ గిల్‌, సర్ఫారాజ‌్ ఖాన్‌ తుది జట్టులో ఉండనున్నారు. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమయిన రజత్‌ పటీదార్‌ స్థానంలో మరో యువ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ టెస్టు అరంగేట్రం చేశాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా నాలుగో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధ్రువ్‌ జురెల్‌ మరోసారి చెలరేగాలని చూస్తున్నాడు. అశ్విన్‌, జడేజాలు ఆల్‌రౌండర్‌లుగా జట్టులో ఉన్నారు. నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్‌ పేసర్‌ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
మరోవైపు బజ్‌బాల్‌ ఆటతీరులో ఇంటాబయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్‌ ఓలీ రాబిన్‌సన్‌ స్థానంలో స్పీడ్‌ స్టార్‌ మార్క్‌వుడ్‌ను తీసుకుంది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌ మినహా.... ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా వందో టెస్టు ఆడుతోన్న జానీ బెయిర్‌ స్టో దారుణంగా ఫెయిల్‌ అయ్యాడు. జట్టులో స్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిన బెయిర్‌స్టో శతక టెస్టులో రాణించాల్సిన అవసరం ఉంది. వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టెస్టుల్లో 700 వికెట్ల క్లబ్‌కు రెండు వికెట్లు దూరంలో ఉండడంతో ఈ మ్యాచ్‌లో ఆ ఘనత సాధించాలని చూస్తున్నాడు. యువ స్పిన్నర్లు టామ్‌ హార్ట్‌లీ, బషీర్‌లు మరోసారి రాణించాలని కోరుకుంటున్నారు


టీమిండియా ఫైనల్‌ 11
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శుబ్‌మన్‌ గిల్‌, ఆకాష్ దీప్, రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్‌, సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్, రజత్ పాటిదార్, 



ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండ‌ర్సన్