చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన పంత్ కేవలం 124 బంతుల్లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో ఆరు సెంచరీలు చేసిన పంత్.. ధోనీ సెంచరీల రికార్డును సమం చేశాడు. మొత్తంగా 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో 109 పరుగులు చేసి అవుటయ్యాడు.

 

గిల్ కూడా తగ్గలేదు

రిషబ్ పంత్ శతకం చేసిన కాసేపటికే శుభ్ మన్ గిల్ కూడా శతకం బాదాడు. 161 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో గిల్ సెంచరీ చేశాడు. పంత్ తో పోలిస్తే కాస్త నిదానంగా బ్యాటింగ్ చేసిన గిల్.. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత తాను ఎంతటి క్లాస్ బ్యాటర్ నో చాటి చెప్పాడు. చూడచక్కని షాట్లతో అలరించాడు. 79 బంతుల్లో అర్ధ శతకం చేసిన గిల్... 161 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా తొలి టెస్టులో భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.

 

బంగ్లా బౌలర్ల ఊచకోత

చెన్నై టెస్టులో భారత్ పట్టు బిగించింది. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సులువుగా పరుగులు చేస్తున్నారు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసి దూకుడు కొనసాగిస్తున్నాడు. మరో బ్యాటర్ పంత్ ఇప్పటికే భారీ శతకంతో బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. బంగ్లాదేశ్ బౌలర్లపై వీరిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. అంతకు ముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు శుభారంభం లేదు. 15 పరుగుల స్కోరు వద్ద భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 10 పరుగులు చేసిన తర్వాత యశస్వి జైస్వాల్ నహిద్ రాణాకు బలయ్యాడు. మెహదీ హసన్ మిరాజ్ వేసిన బంతికి విరాట్ కోహ్లీ 17 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత శుభమన్ గిల్, రిషబ్ పంత్ బంగ్లాదేశ్ బౌలర్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు.