IND vs AUS, 2nd ODI: 


ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఇండోర్‌ స్టేడియంలో భారత బ్యాటర్లు డేంజర్‌ బెల్స్‌ మోగించారు. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. ఒకరి తర్వాత ఒకరు పోటీపడి మరీ కంగారూలకు చుక్కలు చూపించారు. నువ్వు కొడతావా.. నేను కొట్టనా అన్నట్టుగా చెలరేగారు. ఆసీస్‌కు 400 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు. తొలుత యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌ (105; 90 బంతుల్లో 11x4, 3x6), శుభ్‌మన్‌ గిల్‌ (104; 97 బంతుల్లో 6x4, 4x6) సొగసరి సెంచరీలతో కదం తొక్కారు. ఆపై సూర్యకుమార్‌ యాదవ్‌ (72*; 37 బంతుల్లో 6x4, 6x6) వన్డేల్లో తన 360 డిగ్రీ ఊచకోతను పరిచయం చేశాడు. కేఎల్‌ రాహుల్‌ (52; 38 బంతుల్లో 3x4, 3x6) అర్ధశతకం బాదేశాడు.


గిల్‌ దూకుడు


అసలే హోల్కర్‌ చిన్న మైదానం! పైగా భారీ స్కోర్లకు పెట్టింది పేరు! బ్యాటర్లకు స్వర్గధామం. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా దూకుడుగా ఆడాలనే నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టే ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. జట్టు స్కోరు 16 వద్ద ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (8)ని హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. అదే వారికి శాపమైంది. వన్‌డౌన్లో దిగిన శ్రేయస్‌ రావడంతోనే బౌండరీ కొట్టి తన ఉద్దేశమేంటో చెప్పాడు. సొగసైన బౌండరీలు బాదేశాడు. శ్రేయస్‌తో కలిసి ఆసీస్‌ బౌలర్లను చితకబాదాడు. ఫీల్డర్లను మైదానం మొత్తం ఉరికించాడు. రెండో వికెట్‌కు 164 బంతుల్లో 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారంటేనే వారి దూకుడు అర్థం చేసుకోవచ్చు.


శ్రేయస్‌ బాదుడు


శ్రేయస్, గిల్‌ ధాటికి 12.5 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోరు 100కు చేరుకుంది. ఇక గిల్‌ 37, అయ్యర్‌ 41 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు అందుకున్నారు. ఆ తర్వాత దాడి మరింత పెంచారు. 19.3 ఓవర్లకు 150, 28.3 ఓవర్లకు 200 పరుగుల మైలురాయి దాటించారు. ఇదే ఊపులో శ్రేయస్‌ 86 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అయితే భారీ షాట్‌ ఆడే క్రమంలో జట్టు స్కోరు 216 వద్ద అబాట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాంతో కేఎల్‌ రాహుల్‌ అండతో శుభ్‌మన్‌ సెంచరీ కొట్టాడు. ఇందుకోసం 92 బంతులే తీసుకున్నాడు. జట్టు స్కోరు 243 వద్ద గిల్‌ ఔటయ్యాకే అసలు ఊచకోత మొదలైంది.


రాహుల్‌ '360' దంచుడు


క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే కేఎల్‌ రాహుల్‌ తన క్లాసిక్‌ టచ్‌ను ప్రదర్శించాడు. వరుసపెట్టి బౌండరీలు సిక్సర్లు బాదాడు. 35 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇషాన్‌ కిషన్‌ (31; 18 బంతుల్లో 2x4, 2x6) సైతం కుమ్మేశాడు. అతడు ఔటయ్యాక సూర్యకుమార్‌ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. చివరి మ్యాచులో ఎక్కడ ఆపేశాడో అక్కడి నుంచే మొదలు పెట్టాడు. స్టేడియం చుట్టూ సిక్సర్లు, బౌండరీలు కొట్టాడు. రాహుల్‌తో 34 బంతుల్లో 53, జడ్డూతో 24 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యాలు అందించాడు. దాంతో టీమ్‌ఇండియా 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.


భారత జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ షమి


ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, మాథ్యూ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, కామెరాన్‌ గ్రీన్‌, జోస్‌ ఇంగ్లిష్, అలెక్స్‌ కేరీ, సేన్‌ అబాట్‌, ఆడమ్‌ జంపా, జోష్‌ హేజిల్‌వుడ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌