IND vs AUS 2nd ODI: 


భారత్‌, ఆస్ట్రేలియా నేడు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ఇండోర్‌లోని హోల్కర్‌ మైదానం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌ స్మిత్‌  మొదట బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ నేడు అందుబాటులో లేడు.


స్టీవ్‌ స్మిత్, ఆసీస్‌ కెప్టెన్‌: మేం మొదట బౌలింగ్‌ చేస్తాం. వాతావరణం చాలా పొడిగా ఉంది. ఉష్ణోగ్రత్‌ ఎక్కువగా ఉంది. వికెట్ చాలా బాగుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఛేదన సులభం. ఒకవేళ మంచు కురిస్తే మాకు మరింత ప్రయోజనం ఉంటుంది. మేం కచ్చితంగా గెలవాలి. అలాగే కొన్ని ప్రయోగాలు చేయాలి.


కేఎల్‌ రాహుల్‌, భారత  కెప్టెన్‌: మైదానం పరిమాణాన్ని చూస్తే మేమూ మొదట బౌలింగే చేయాలనుకున్నాం. వికెట్‌ బాగుంది. మొదట బ్యాటింగ్‌ చేసి టార్గెట్‌ నిర్దేశించడం సవాలే. జట్టులో ఒకే మార్పు చేశాం. జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చాం. ప్రసిద్ధ్‌ కృష్ణ జట్టులోకి వచ్చాడు. క్రీజులో సమయం గడిపేందుకు మా బ్యాటర్లకు ఇది మంచిది.


పిచ్‌ రిపోర్ట్‌: ఇండోర్‌ స్టేడియం చిన్నది. బౌండరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. స్క్వేర్‌ వెనక బ్యాటింగ్‌ చేసేవాళ్లకు బౌండరీ 55 మీటర్ల దూరంలో ఉంటుంది. పిచ్‌ మందకొడిగా ఉంది. కానీ గట్టిగా ఉంది. ఎక్కువ స్కోర్‌ నమోదవుతుంది. పేస్ బౌలర్లకు బౌలింగ్‌ సవాలే. ఎక్కువ బంతులు బౌండరీకే వెళ్తాయి. ఎక్కువ టార్గెట్‌ ఇస్తే స్పిన్నర్లు కీలకం అవుతారు.


భారత జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ షమి


ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, మాథ్యూ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, కామెరాన్‌ గ్రీన్‌, జోస్‌ ఇంగ్లిష్, అలెక్స్‌ కేరీ, సేన్‌ అబాట్‌, ఆడమ్‌ జంపా, జోష్‌ హేజిల్‌వుడ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌


ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాలతో అతడు నేటి మ్యాచ్‌ ఆడటం లేదని తెలిసింది. మొహాలి నుంచి అతడు ఇండోర్‌కు వెళ్లలేదు. కుటుంబ సభ్యులను కలిసేందుకు ముంబయికి వెళ్లినట్టు బీసీసీఐ తెలిపింది. మ్యాచ్‌ జరగడానికి గంట ముందు ట్వీట్‌ చేసింది. అతడి స్థానంలో యువ పేసర్ ముకేశ్‌ కుమార్‌ ఆడుతున్నట్టు ప్రకటించింది. బుమ్రా తిరిగి మూడో వన్డేకు జట్టుతో కలుస్తాడు.


మొదటి వన్డే వివరాలు


ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 48.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్లు తీసిన భారత పేసర్ మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52: 53 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (71: 77 బంతుల్లో, 10 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (74: 63 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించారు. కేఎల్ రాహుల్ (58 నాటౌట్: 63 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (50: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో షమి ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున జంపా రెండు వికెట్లు పడగొట్టాడు.