India Vs West Indies  IML Tourney: ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్ టీ20 టోర్నీలో భార‌త్ విజేత‌గా నిలిచింది. అన్ని రంగాల్లో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన ఈ పోరులో చివ‌రికి టీమిండియానే విజ‌యం వ‌రించింది. ముఖ్యంగా వెస్టిండీస్ కు చెందిన బ్రియాన్ లారా వర్సెస్ ఇండియా గ్రేట్ స‌చిన్ టెండూల్క‌ర్ మ‌ధ్య పోరుగా అభివ‌ర్ణించిన ఈ మ్యాచ్ ను సునాయాసంగా భార‌త్ గెలుచుకుంది.


రాయ్ పూర్ లో జ‌రిగిన ఈ ఫైన‌ల్లో ఆరు వికెట్ల‌తో వెస్టిండీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. టాస్ నెగ్గి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల‌కు 148 ప‌రుగులు చేసింది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ లెండిల్ సిమ్మ‌న్స్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (41 బంతుల్లో 57, 5 ఫోర్లు, 1 సిక్స‌ర్)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బ్యాటింగ్ కు అనుకూల‌మైన ఈ పిచ్ పై విండీస్ ను భార‌త బౌల‌ర్లు చ‌క్క‌గా నిలువ‌రించారు. భార‌త బౌల‌ర్ల‌లో విన‌య్ కుమార్ మూడు వికెట్ల‌తో రాణించాడు. టార్గెట్ ను భార‌త్ 17.1 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల‌కు 149 ప‌రుగులు చేసి ఛేదించింది. తెలుగు ప్లేయ‌ర్ అంబ‌టి తిరుపతి రాయుడు సూప‌ర్ ఫిఫ్టీ (50 బంతుల్లో 74, 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో టార్గెట్ లో స‌గం ప‌రుగులు త‌నే సాధించాడు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌లో యాష్లే న‌ర్స్ రెండు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. ఈ విజ‌యంతో తొలి సీజ‌న్ టైటిల్ ను భార‌త్ సాధించింది. ఫైన‌ల్లో అద్భుతంగా ఆడిన రాయుడుకు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ల‌భించింది. 






క‌ట్ట‌డి చేసిన బౌల‌ర్లు..
ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ కు ఆరంభంలో మంచి శుభారంభం దక్కింది. ఓపెన‌ర్ డ్వేన్ స్మిత్ (35 బంతుల్లో 45, 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో రెచ్చిపోవ‌డంతో విండీస్ ప‌వ‌ర్ ప్లేలో దాదాపుకు 9కి పైగా ర‌న్ రేట్ తో ప‌రుగులు సాధించింది. అయితే మ‌రో ఎండ్ లో కెప్టెన్ క‌మ్ ఓపెన‌ర్ బ్రియాన్ లారా (6), పెర్కిన్స్ (6) వికెట్ల‌ను తీసిన భార‌త బౌలర్లు ప్ర‌త్య‌ర్థికి ముకుతాడు వేసింది. ఈ ద‌శ‌లో సిమ్మ‌న్స్- స్మిత్ జంట జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నిం చేసినా అంత‌గా స‌ఫ‌లం కాలేదు. ఫిఫ్టీకి ద‌గ్గ‌ర‌లో స్మిత్ ఔట‌వ‌గా, మిగ‌తా బ్యాట‌ర్ల స‌హాకారంతో జ‌ట్టుకు స‌వాలు విస‌ర‌గ‌లిగే స్కోరును అందించాడు. మిగ‌తా బౌల‌ర్ల‌లో షాబాజ్ న‌దీమ్ కు రెండు, ప‌వ‌న్ నేగి, స్టువ‌ర్ట్ బిన్నీకి ఒక వికెట్ ద‌క్కింది. 


రాయుడు వ‌న్ మేన్ షో..
ఛేజింగ్ ను భార‌త్ అల‌వోక‌గా పూర్తి చేసిందంటే దానికి కార‌ణం రాయుడని చెప్ప‌క త‌ప్పుదు. త‌ను ఆది నుంచి ధాటిగా ఆడి, ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. మరో ఓపెన‌ర్ క‌మ్ కెప్టెన్ స‌చిన్ టెండూల్క‌ర్ (25) తో కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. వీరిద్ద‌రూ కూడా వేగంగా ఆడ‌టంతో 47 బంతుల్లోనే 67 ప‌రుగులు జోడించారు. ఈ ద‌శ‌లో స‌చిన్ ఔటైనా, మిగ‌తా బ్యాట‌ర్ల‌తో క‌లిసి జ‌ట్టును విజ‌యానికి చేరువ‌గా తెచ్చాడు. విజ‌యానికి మ‌రో 22 ప‌రుగులు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో రాయుడు వెనుదిర‌గగా, యువ‌రాజ్ సింగ్ (13 నాటౌట్), బిన్నీ (16 నాటౌట్) ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చి, జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. మిగ‌తా బౌల‌ర్ల‌లో టీనో బెస్ట్, సులేమ‌న్ బెన్ కు త‌లో వికెట్ ద‌క్కింది.