Ryan ten Doeschate Comments: టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ లో భారత్ ఐదు టెస్టుల సిరీస్ కోసం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గతవారం జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోవడంతో 0-1తో సిరీస్ లో వెనుకంజలో ఉంది. ఈ నేపథ్యంలో జూలై 2 నుంచి బర్మింగ్ హామ్ లో రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే ప్రస్తుతమున్న పిచ్ పరిస్థితులను బట్టి, భారత తుదిజట్టులో మార్పులు ఉండే అవకాశముంది. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. భారత సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కటే కూడా ఈ విషయాన్ని చూచాయగా ధ్రువీకరించాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముందని పేర్కొన్నాడు. ఒక స్పిన్నర్ గా వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కాగా, మరో స్పిన్నర్ పై చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరో స్పిన్ ఆల్ రౌండర్ కంటే కూడా నికార్సైన స్పిన్నర్ తోనే బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోందని తెలుస్తోంది. దీంతో కుల్దీప్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.
స్పిన్నర్లకు అనుకూలం..తొలి టెస్టు జరిగిన లీడ్స్ వేదికతో పోలిస్తే, రెండో టెస్టు వైదికైన బర్మింగ్ హామ్ మైదానం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముందని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. దీంతో ఇద్దరు స్పిన్నర్లు ఆడే అవకాశముంది. ఇక తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి పేస్ ఆల్ రౌండర్ కోటాలో తుది జట్టులో చోటు దక్కడం ఖాయమన్నట్లుగా డస్కటే మాట్టాడాడు. తొలి టెస్టులో ఆల్ రౌండర్ కోటాలో బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ అటు ఎక్కువగా బౌలింగ్ చేయలేదు, ఇటు బ్యాటింగ్ లో అయితే ఘోరంగా నిరాశ పర్చాడు. దీంతో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో దుమ్ము రేపిన నితీశ్ ను ఆడించాలని టీమిండియా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందంటే...ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. తొలి టెస్టులో ఇరువురు తలో సెంచరీ చేసి, మంచి ఫామ్ మీద ఉన్నారు. ఇద్దరి మధ్య సమన్వయం కూడా బాగుంది. వన్ డౌన్ లో సాయి సుదర్శన్ ను తప్పించి, వెటరన్ కరుణ్ నాయర్ ను ఆడించే అవకాశముంది. ఇక మిడిలార్డర్లో వరుసగా కెప్టెన్ శుభమాన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఆడతారు. ఆల్ రౌండర్లుగా నితీశ్, రవీంద్ర జడేజా ఆడతారు. మరో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగొచ్చు. ఈ మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా బరిలోకి దిగినట్లయితే, అతనికి తోడుగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆడతాడు. బుమ్రా లేకపోతే, లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా టాస్ వేసిన తర్వాతే భారత తుదిజట్టుపై అంచనా వచ్చే అవకాశముంది.