వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 88 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది.


అదరగొట్టిన అయ్యర్
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఓపెనర్ ఇషాన్ కిషన్ (11: 13 బంతుల్లో,  ఒక ఫోర్) ఐదో ఓవర్లో అవుటయ్యాడు. అయితే వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడాతో (38: 25 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి శ్రేయస్ అయ్యర్ (64: 40 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 76 పరుగులు జోడించారు.


అయితే శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా వరుస ఓవర్లలో అవుటయ్యారు. సంజు శామ్సన్ (15: 11 బంతుల్లో, రెండు ఫోర్లు), దినేష్ కార్తీక్ (12: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా త్వరగా అవుట్ అయ్యారు. చివర్లో హార్దిక్ పాండ్యా (28: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడినా, అవతలి ఎండ్‌లో సరైన సహకారం లభించకపోవడంతో భారత్ చివర్లో తడబడింది.


చివరి ఐదు ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 20 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు వికెట్లు దక్కించుకోగా... జేసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్, హేడెన్ వాల్ష్ తలో వికెట్ పడగొట్టారు.


హెట్‌మేయర్ మినహా...
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. స్కోరు బోర్డు మీద మొదటి పరుగు చేరకుండానే మొదటి వికెట్‌ను విండీస్ కోల్పోయింది. షిమ్రన్ హెట్‌మేయర్ (56: 35 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మినహా ఇంకెవరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు తీయగా... కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మూడేసి వికెట్లు పడగొట్టారు.