వెస్టిండీస్‌తో థ్రిల్లింగ్‌గా సాగిన రెండో వన్డేలో టీమిండియా రెండు వికెట్లతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 2-0తో టీమిండియా సొంతం అయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 49.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ విన్నింగ్ ఫిఫ్టీతో పాటు వికెట్ కూడా తీసిన అక్షర్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేసి టీమిండియా గెలవడం విశేషం.


అదరగొట్టిన హోప్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ (39: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), షాయ్ హోప్ (115: 135 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 9.1 ఓవర్లలోనే 65 పరుగులు జోడించారు. ఓపెనర్ కైల్ మేయర్స్ వేగంగా ఆడాడు. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో దీపక్ హుడా వెస్టిండీస్‌ను దెబ్బ తీశాడు.


ఆ తర్వాత షామర్హ్ బ్రూక్స్ (35: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు), హోప్‌లు రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అయితే షామర్హ్ బ్రూక్స్, బ్రాండన్ కింగ్‌లు (0: 5 బంతుల్లో) వరుస ఓవర్లలో అవుటయ్యారు. దీంతో వెస్టిండీస్ 130 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ నికోలస్ పూరన్ (74: 77 బంతుల్లో, ఒక ఫోర్, ఆరు సిక్సర్లు), హోప్ వెస్టిండీస్‌ను ఆదుకున్నారు. వీరు నాలుగో వికెట్‌కు 117 పరుగులు జోడించారు.


చివర్లో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను దెబ్బ తీశాడు. చివర్లో వెస్టిండీస్ తరఫున వేగంగా పరుగులు చేసే వాళ్లు లేకపోవడంతో ఆఖర్లో తడబాటుకు లోనైంది. దీంతో వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా... దీపక్ హుడా, అక్షర్ పటేల్, చాహల్ చెరో వికెట్ తీశారు.


అక్షర్ పటేల్ షో..
312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభం అయింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (13: 31 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (43: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు) 16 ఓవర్లలోపే అవుటయ్యారు. అప్పటికి జట్టు స్కోరు 66 పరుగులు మాత్రమే. వీరు అవుటయ్యాక వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (9: 8 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో టీమిండియా 79 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (63: 71 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), సంజు శామ్సన్ (54: 51 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. అయితే మ్యాచ్ కీలక దశలో శ్రేయస్‌ను అల్జారీ జోసెఫ్ అవుట్ చేయగా, సంజు శామ్సన్ రనౌట్ అయ్యాడు. వీరు అవుటయ్యాక వచ్చిన దీపక్ హుడా (33: 36 బంతుల్లో, రెండు ఫోర్లు), అక్షర్ పటేల్ (64 నాటౌట్: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) వేగంగా ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 33 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు.


అనంతరం దీపక్ హుడా అవుటైనా అక్షర్ పటేల్ టెయిలెండర్లతో కలిసి మ్యాచ్‌ను ముగించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, అకియల్ హొస్సేన్‌లకు తలో వికెట్ దక్కింది.