శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా తక్కువ స్కోరుకు పరిమితం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున అర్థ సెంచరీతో రోహిత్ శర్మ (53: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. శ్రీలంక విజయానికి 300 బంతుల్లో 213 పరుగులు కావాలి.


అర్థ సెంచరీతో చెలరేగిన కెప్టెన్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియాకు శుభారంభం దక్కింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (53: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తొలి ఓవర్‌ నుంచే వేగంగా ఆడటం ప్రారంభించాడు. చక్కటి ఏరియల్‌ షాట్లతో ప్రత్యర్థి పేసర్లకు చుక్కలు చూపించాడు. రోహిత్‌కు శుభ్‌మన్‌ గిల్‌ (19: 25 బంతుల్లో, రెండు ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరి ఆటతో భారత్‌ 10 ఓవర్లలోనే 65 పరుగుల స్కోరు‌ చేసింది. ఇదే క్రమంలో 44 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన రోహిత్‌ శర్మ వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.


అయితే దునిత్ వెల్లెలాగె వేసిన 12వ ఓవర్లో శుభ్‌మన్ గిల్‌ బౌల్డ్‌ అవ్వడంతో 80 పరుగుల తొలి భాగస్వామ్యానికి తెరపడింది. మరో 10 పరుగులకే కింగ్‌ విరాట్‌ కోహ్లీ (3: 12 బంతుల్లో), 16వ ఓవర్లో రోహిత్‌ శర్మ కూడా వెల్లెలాగె బౌలింగ్‌లోనూ ఔటవ్వడంతో టాప్‌ ఆర్డర్‌ పని ముగిసింది.


కఠినమైన పిచ్‌.. లంక స్పిన్నర్లను ఆడలేని పరిస్థితుల్లో కేఎల్‌ రాహుల్‌ (39: 44 బంతుల్లో, రెండు ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (33: 61 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అద్భుత పోరాటాన్ని ప్రదర్శించారు. వీరు మొదట వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. ఇషాన్ కిషన్‌ ఎక్కువగా డిఫెండ్‌ చేస్తున్నప్పటికీ కేఎల్ రాహుల్‌ మాత్రం తన క్లాస్‌ కొనసాగించాడు. వేగంగా పరుగులు సాధించాడు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 89 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అర్థ శతకం వైపు సాగుతున్న కేఎల్‌ రాహుల్‌ను జట్టు స్కోరు 154 వద్ద వెల్లెలాగేనే పెవిలియన్‌ బాట పట్టించాడు.


అక్కడి నుంచి చరిత్‌ అసలంక బౌలింగ్‌ అటాక్‌ను నడిపించాడు. జట్టు స్కోరు 170 వద్ద ఇషాన్ కిషన్‌ను ఔట్‌ చేశాడు. రవీంద్ర జడేజా (4: 19 బంతుల్లో), బుమ్రా (5: 12 బంతుల్లో), కుల్‌దీప్‌ యాదవ్‌‌లను (0: 1 బంతి) స్వల్ప స్కోర్లకే ఔట్‌ చేశాడు. అంతకు ముందే హార్దిక్ పాండ్యా (5: 18 బంతుల్లో)ను వెల్లెలాగె పెవిలియన్‌కు చేర్చాడు. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (26; 36 బంతుల్లో, ఒక సిక్సర్) పోరాడటంతో టీమ్‌ఇండియా స్కోరు 213 పరుగులకు ఆలౌట్ అయింది. 










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial