భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ సంచలనం సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో సిరాజ్ ఈ ఫీట్ సాధించాడు. పతుం నిశ్శంక, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వలను ఈ ఓవర్లో సిరాజ్ అవుట్ చేశాడు.


ఈ ఓవర్ మొదటి బంతిని పతుం నిశ్శంక బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు బంతిని ఆడబోయి జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. క్రీజులోకి వచ్చిన సదీర సమరవిక్రమ రెండో బంతిని డాట్ బాల్‌గా ఆడాడు. మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి చరిత్ అసలంక కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో బంతిని ధనంజయ డిసిల్వ బౌండరీకి తరలించాడు. చివరి బంతికి ధనంజయ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 


బుమ్రా వేసిన తర్వాతి ఓవర్ మెయిడెన్‌గా ముగిసింది. అయితే తర్వాతి ఓవర్లో సిరాజ్ మళ్లీ చెలరేగాడు. నాలుగో బంతికి కెప్టెన్ దసున్ షనకను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఐదు వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. సిరాజ్ బంతులకు శ్రీలంక బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయింది. ప్రస్తుతానికి శ్రీలంక ఏడు ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (5: 22 బంతుల్లో, ఒక ఫోర్), దునిత్ వెల్లలాగే (4: 5 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.






ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. కానీ కొత్త పిచ్‌పై మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇది బౌలింగ్‌కు అనుకూలించే పిచ్ అని అంచనా వేశారు. దానికి తగ్గట్లే భారత పేసర్లు చెలరేగిపోయారు. భారత జట్టులోకి విరాట్ కోహ్లీ తిరిగి వచ్చాడు. అక్షర్ పటేల్ గాయపడటంతో వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. శ్రీలంక కూడా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. మహీష్ తీక్షణ స్థానంలో దుషన్ హమంత జట్టులోకి వచ్చాడు.


భారత జట్టులోకి విరాట్ కోహ్లీ తిరిగి వచ్చాడు. అక్షర్ పటేల్ గాయపడటంతో వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. శ్రీలంక కూడా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. మహీష్ తీక్షణ స్థానంలో దుషన్ హమంత జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో ఇంతకు ముందు జరిగిన ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాను శ్రీలంక 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం శ్రీలంకను భారత జట్టు 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ చేసింది.


భారత్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్


శ్రీలంక తుదిజట్టు
పతుమ్ నిశ్శంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ