భారత్‌తో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. కానీ కొత్త పిచ్‌పై మ్యాచ్ జరగనుంది. ఇది బౌలింగ్‌కు అనుకూలించే పిచ్ అని అంచనా.


ఇక తుది జట్టు విషయానికి వస్తే... జట్టులోకి విరాట్ కోహ్లీ తిరిగి వచ్చాడు. అక్షర్ పటేల్ గాయపడటంతో వాషింగ్టన్ సుందర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. శ్రీలంక కూడా జట్టులో ఒక మార్పు చేసింది. మహీష్ తీక్షణ స్థానంలో దుషన్ హమంత జట్టులోకి వచ్చాడు.


శ్రీలంకతో ఇంతకు ముందు జరిగిన ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక జట్టు 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది.


టీమిండియా తరఫున అర్థ సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ (53: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో దునిత్ వెల్లలాగే (42: 46 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (53: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తొలి ఓవర్‌ నుంచే వేగంగా ఆడటం ప్రారంభించాడు. రోహిత్‌ శర్మకు శుభ్‌మన్‌ గిల్‌ (19: 25 బంతుల్లో, రెండు ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరి దూకుడైన ఆటతో భారత్‌ 10 ఓవర్లలోనే 65 పరుగుల స్కోరు‌ చేసింది. ఇదే క్రమంలో 44 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.


దునిత్ వెల్లెలాగె వేసిన 12వ ఓవర్లో శుభ్‌మన్ గిల్‌ బౌల్డ్‌ అవ్వడంతో 80 పరుగుల తొలి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మరో 10 పరుగులకే కింగ్‌ విరాట్‌ కోహ్లీ (3: 12 బంతుల్లో), 16వ ఓవర్లో రోహిత్‌ శర్మ కూడా వెల్లెలాగె బౌలింగ్‌లోనూ ఔటవ్వడంతో టాప్‌ ఆర్డర్‌ పని ముగిసింది.


ఈ పరిస్థితుల్లో కేఎల్‌ రాహుల్‌ (39: 44 బంతుల్లో, రెండు ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (33: 61 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అద్భుత పోరాటాన్ని ప్రదర్శించారు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 89 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అర్థ శతకం వైపు సాగుతున్న కేఎల్‌ రాహుల్‌ను జట్టు స్కోరు 154 వద్ద వెల్లెలాగేనే పెవిలియన్‌ బాట పట్టించాడు. అక్కడి నుంచి చరిత్‌ అసలంక బౌలింగ్‌ అటాక్‌ను నడిపించాడు. అతను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమ్‌ఇండియా స్కోరు 213 పరుగులకు ఆలౌట్ అయింది.


భారత్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్


శ్రీలంక తుదిజట్టు
పతుమ్ నిశ్శంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ