IND vs SL, 3rd T20, ACA-VDCA Stadium: అచ్చొచ్చిన విశాఖ తీరంలో టీమ్‌ఇండియా గెలుపు తలుపు తట్టింది! ఐదు టీ20ల సిరీసులో తొలి విజయం అందుకుంది. 1-2తో దక్షిణాఫ్రికాను నిలువరించింది. నిర్ణయాత్మక మూడో పోరులో సఫారీలను 48 పరుగుల తేడాతో ఓడించింది. 180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ప్రత్యర్థిని 19.1 ఓవర్లకు 131కే ఆలౌట్ చేసింది. యూజీ చాహల్‌ (3), హర్షల్‌ పటేల్‌ (4), అక్షర్‌ (1), భువి (1) బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శించారు. ఛేదనలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (29; 24 బంతుల్లో 3x4, 1x6), రెజా హెండ్రిక్స్‌ (23; 20 బంతుల్లో 2x4, 1x6) టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (57; 35 బంతుల్లో 7x4, 2x6), ఇషాన్‌ కిషన్‌ (54; 35 బంతుల్లో 5x4, 2x6), హార్దిక్‌ పాండ్య (31; 21 బంతుల్లో 4x4, 0x6) దంచికొట్టారు.


ఈసారి బౌలింగ్‌ అదుర్స్‌!


ఛేదనలో సఫారీలకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 23 వద్దే తెంబా బవుమా (8)ని అక్షర్‌ పటేల్‌ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే రెజా హెండ్రిక్స్‌ (23)ను హర్షల్‌ పటేల్‌ పెవిలియన్‌ పంపించాడు. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. ఆ తర్వాత యుజ్వేంద్ర చాహల్‌ తన బౌలింగ్‌ సత్తాను ప్రదర్శించారు. స్వల్ప వ్యవధిలో డ్వేన్‌ ప్రిటోరియస్‌ (20), వాండర్‌ డుసెన్‌ (1) వికెట్లు పడగొట్టాడు. హర్షల్‌ పటేల్‌ ప్రమాదకర మిల్లర్‌ (3)ను ఔట్‌ చేసి ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ కాసేపు టీమ్‌ఇండియా బౌలర్లను ప్రతిఘటించాడు. అతడిని 14.5వ బంతికి యూజీ పెవిలియన్‌ పంపడంతో సఫారీలు 100/6తో వెనకబడ్డారు. వరుస వికెట్లు పడటంతో రన్‌రేట్‌ పెరిగి ఒత్తిడికి గురైన ఆ జట్టు చివరికి 131కి పరిమితమైంది.


ఈ సారి గైక్వాడ్‌


ఐదు టీ20ల సిరీసులో సఫారీలు 2-0తో ఆధిక్యంలో ఉండటంతో టీమ్‌ఇండియాకు ఇది చావోరేవో మ్యాచ్‌! ఇలాంటి నిర్ణయాత్మక పోరులోనూ కెప్టెన్‌ రిషభ్ పంత్‌ టాస్‌ ఓడిపోవడం అన్‌లక్కీ! దాంతో భారత్‌ మొదట బ్యాటింగ్‌కు వచ్చింది. కీలక మ్యాచులో ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ మంచి స్టార్ట్‌ ఇచ్చారు. తొలి మూడు ఓవర్లు నిలకడగా ఆడినా నోకియా వేసిన ఐదో ఓవర్లో గైక్వాడ్‌ వరుసగా 5 బౌండరీలు కొట్టి జోరు పెంచాడు. 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. కిషన్‌ సైతం 31 బంతుల్లో అర్ధశతకం చేయడంతో 10.5 ఓవర్లకు స్కోరు 100 దాటింది.


ప్రమాదకరంగా మారిన ఓపెనింగ్‌ జోడీని జట్టు స్కోరు 97 వద్ద రుతురాజ్‌ను ఔట్‌ చేయడం ద్వారా మహరాజ్‌ విడదీశాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ (13), రిషభ్ పంత్‌ (6), దినేశ్ కార్తీక్‌ (6) వరుసగా ఔటయ్యారు. హార్దిక్‌ మాత్రం అలాగే ఉండి చక్కని షాట్లు ఆడి స్కోరును 179/5కు తీసుకెళ్లాడు. ప్రిటోరియస్‌ 2, మహరాజ్‌, శంషి, రబాడా తలో వికెట్‌ తీశారు.