ప్రపంచకప్‌లో ఎదురొచ్చిన ప్రతి జట్టునూ ఓడిస్తూ సెమీస్‌లో అడుగు పెట్టిన భారత్‌... దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా రోహిత్ సేన బరిలోకి దిగింది. పుట్టినరోజు సందర్భంగా కోహ్లీ తప్పకుండా శతకం చేస్తాడని అభిమానులు గంపెడాశాలు పెట్టుకున్నారు. ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. లక్ష్యాన్ని ఛేదించడంలో ప్రొటీస్‌ కష్టాలు పడుతున్న వేళ టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోవడం విజయ శాతాన్ని పెంచింది. దక్షిణాఫ్రికా పేసర్లలో జాన్సన్‌, కొయెట్జీ నిలకడగా రాణిస్తున్నారు. ఆ జట్టుకు రబాడ, ఎంగిడిల అనుభవం కూడా కలిసొచ్చేదే. రబాడకు భారత్‌పై మంచి రికార్డుంది. 

 

బ్యాటింగ్‌లో భారత జట్టు చాలా బలంగా ఉంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్‌లతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది. గత మ్యాచ్‌లో త్రుటిలో సెంచరీలు చేజార్చుకున్న కోహ్లీ, గిల్ ఈ మ్యాచ్‌లు కచ్చితంగా శతకాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు. రోహిత్‌ శర్మ కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన శ్రేయస్స్‌ అయ్యర్‌ మరోసారి దానిని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఇటు టీమిండియా బౌలింగ్‌ విభాగం పిచ్‌పై నిప్పులు చెరుగుతోంది. శ్రీలంకను కేవలం 55 పరుగులకే కుప్పకూల్చి సత్తా చాటింది. ఆడిన మూడు మ్యాచుల్లో మహమ్మద్ షమీ రెండోసార్లు అయిదు వికెట్లు తీసి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా, సిరాజ్‌ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా కూడా రాణిస్తుండడంతో టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. 

 

ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు అప్రతిహాత జైత్రయాత్ర సాగిస్తుంటే.... సఫారీ జట్టు కూడా అదే తరహాలో ముందుకు సాగుతోంది. ఒక్క నెదర్లాండ్స్‌ మినహా భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అసలు దక్షిణాఫ్రికాకు ఓటమే లేదు. పవర్ హిట్టర్లతో నిండిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్.. భారత బౌలర్లకు సవాల్‌ విసరనుంది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు 428 దక్షిణాఫ్రికా పేరు మీదే ఉంది. అయిదు మ్యాచుల్లో ప్రొటీస్‌ 300కుపైగా పరుగులు చేసింది. డి కాక్ ఏడు మ్యాచ్‌ల్లో 545 పరుగులతో ఈ ప్రపంచకప్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. కానీ లక్ష్యాన్ని ఛేదించడమే ప్రొటీస్‌ను ఇబ్బంది పెడుతోంది. దక్షిణాఫ్రికా పాకిస్థాన్‌పై చివరి వికెట్‌కు విజయం సాధించింది. 

 

భారత్ ఫైనల్‌ 11:

 రోహిత్ శర్మ ( కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ,  సూర్యకుమార్ యాదవ్, 

 

దక్షిణాఫ్రికా ఫైనల్‌ 11: 

టెంబా బావుమా (కెప్టెన్‌),  క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్,  కేశవ్ మహరాజ్, ఐడెన్ మాక్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎంగిడి, కగిసో రబాడ, షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్