దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అయిదు వికెట్లతో సత్తా  చాటిన  టీమిండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. ద‌క్షిణాప్రికా గ‌డ్డ పై ఐదు వికెట్లు తీసిన మొద‌టి భార‌త పేస‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 ఓవ‌ర్లు వేసిన అర్ష్‌దీప్ సింగ్ 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అర్ష్‌దీప్ కంటే ముందు ఐదు వికెట్ల ప్రద‌ర్శన చేసిన వారంతా స్పిన్నర్లే . మొట్టమొద‌టి సారి ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై తొలిసారి 1999లో స్పిన్నర్ సునీల్ జోషి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు.  ఆ త‌రువాత 2018లో సెంచూరియన్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచులో స్పిన్నర్ 22 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు నేలకూల్చాడు. తాజాగా అర్ష్‌దీప్ సింగ్ మొద‌టి పేస‌ర్‌గా నిలిచాడు. అయితే మ్యాచ్‌ ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనైన‌ట్లు అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. ఈ మ్యాచ్ కంటే ముందు అర్ష్‌దీప్ మూడు వ‌న్డేలు ఆడిన‌ప్పటికీ ఒక్క వికెట్ కూడా ప‌డ‌గొట్ట‌లదు. ఇదే విష‌యాన్ని అత‌డు చెప్పాడు. అయితే.. నాలుగో మ్యాచులో ఏకంగా ఐదు వికెట్లతో రాణించ‌డం ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు. 

అతిథ్య దక్షిణాఫ్రికాపై భారత్ జట్టు ఘనవిజయం సాధించింది. జొహెన్నస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో... టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు భారత్ పేసర్ల ధాటికి  విలవిల్లాడింది. యువపేసర్లు అర్ష్‌దీప్‌సింగ్‌, ఆవేశ్‌ఖాన్‌ నిప్పులు చెరగడంతో 27.3 ఓవర్లో 116 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఫెలుక్వాయో ఒక్కడే 33 పరుగులతో  ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌ టోనీ డి జోర్జి 28 పరుగులు చేశాడు. తొలి ఓవర్‌ నుంచే భారత్‌  పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.అయిదు వికెట్లు తీసి అర్ష్‌దీప్‌ ప్రోటీస్‌ పతనాన్ని శాసించాడు.

ఆవేశ్‌ఖాన్‌ కూడా నాలుగు వికెట్లతో రాణించాడు. ప్రొటీస్‌ జట్టులో ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే అవుటయ్యారు. సొంతగడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ కేవలం 16.4 ఓవర్లో రెండు వికెట్ల కోల్పోయి విజయాన్ని అందుకుంది. అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్‌  తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అర్థ శతకంతో రాణించాడు. 

మ్యాచ్ లో తొలి ఓవర్‌ నుంచే భారత్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. రెండో ఓవర్‌లోనే వరుసగా రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ సఫారీలను కోలుకోలేని దెబ్బ తీశాడు. 1.4 ఓవర్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హెండ్రిక్స్‌ను అర్ష్‌దీప్‌ బౌల్డ్ చేశాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని హెండ్రిక్స్‌ వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే వాండర్‌ డసెన్‌ను అర్ష్‌దీప్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అర్ష్‌దీప్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడబోయిన డసెన్‌ ఎల్బీ అయ్యాడు. అంపైర్‌ ఔట్‌ ఇచ్చినా.. డసెన్‌ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. సమీక్షలో ‘అంపైర్స్‌ కాల్‌’ రావడంతో డసెన్‌కు నిరాశ గా వెనుదిరిగాడు.దీంతో మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి సఫారీలు కష్టాల్లో పడ్డారు. . తొలి నాలుగు వికెట్లు అర్ష్‌దీప్‌సింగ్‌ తీయగా... తర్వాతి నాలుగు వికెట్లు ఆవేశ్‌ఖాన్‌ తీశాడు.  ఆ తర్వాత మరో వికెట్‌ తీసిన అర్ష్‌దీప్‌ దక్షిణాఫ్రికాపై అయిదు వికెట్లు తీసిన తొలి పేసర్‌గా నిలిచాడు.