టీమిండియా(Team India) సఫారీ గడ్డపై నయా చరిత్ర సృష్టించింది. కేవలం రోజున్నరలోనే ముగిసిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa)పై ఘన విజయం సాధించింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా సీమర్లు నిప్పులు చెరిగిన వేళ రోహిత్‌ సేన విజయదుంధుభి మోగించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ 2023-2025 పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌ళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.  తొలి ఇన్నింగ్స్‌లో సఫారీల పతనాన్ని శాసించిన మహ్మద్‌ సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా... కేప్‌టౌన్‌లో భారత్‌ తొలి విజయాన్ని నమోదుచేసింది. రెండో టెస్ట్‌ గెలుపుతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకున్న రెండో భార‌త కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు. ఇప్పుడు టీమిండియా పేసు గుర్రం జస్ప్రిత్‌ బ్రుమా కూడా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో సౌతాఫ్రికా ప‌త‌నాన్ని శాసించిన బుమ్రా.... మొద‌టి ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తంగా బుమ్రా ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు సాధించి ప‌లు రికార్డుల‌ను సాధించాడు. 

 

ఒకే ఒక్క భారతీయుడు

కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా బుమ్రా ఘ‌న‌త సాధించాడు. ఈ మైదానంలో బుమ్రా 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇప్పటి వ‌ర‌కు ఈ రికార్డు జవగళ్‌ శ్రీనాథ్ పేరిట ఉండేది. కేప్‌టౌన్‌లో జవగళ్‌ శ్రీనాథ్‌ 12 వికెట్లు తీశాడు. అనిల్‌కుంబ్లే 12 వికెట్లు తీసి మూడో స్థానంలో నిలిచాడు. కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో షేన్‌వార్న్‌తో క‌లిసి సంయుక్తంగా బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. ఈ మైదానంలో ఇప్పటివరకూ మూడు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా... 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆట‌గాడు కోలిన్ బ్లైత్ 25 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

 

బుమ్రా మరో రికార్డు

ద‌క్షిణాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌల‌ర్ల జాబితాలో బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 45 వికెట్లతో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉండగా.... 43 వికెట్లతో జగవళ్‌ శ్రీనాథ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా 38 వికెట్లతో బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. 30 వికెట్లతో జహీర్‌ఖాన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. 

 

సిరీస్‌ కోల్పోకుండా ముగింపు

భారత క్రికెట్‌ జట్టుదక్షిణాఫ్రికా పర్యటనను సిరీస్‌ ఓటమి లేకుండా ముగించింది. కేవలం 107 ఓటర్లు సాగిన రెండోటెస్టులో గెలిచిన భారత్‌ టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా.... టీ ట్వంటీ సిరీస్‌ను సమం చేసింది. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను డ్రా చేసుకున్న రెండో భార‌త కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు. మ‌హేంద్ర సింగ్ ధోనీ త‌రువాత... దక్షిణాఫ్రికాలో ప్రొటీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ను డ్రా చేసుకున్న కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు.