హాఫ్‌ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నప్పుడు నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉండిపోతే ఎంత బాధగా ఉంటుంది. ఆ టైంలో స్ట్రైక్‌ చేస్తున్న బ్యాటర్‌... ఒక్క పరుగు చేసి ఇస్తాను హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకో అని చెబితే ఎవరు కాదంటారు. కానీ అన్నాడు... అందుకే ఆతను కింగ్‌ కోహ్లీ అయ్యాడు అంటున్నారు ఫ్యాన్స్‌. 


విరాట్‌ కోహ్లీ రన్‌ మెషిన్‌గా పేరు తెచ్చుకొని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 71 సెంచరీలతో ప్రపంచంలోనే రికీపాంటింగ్‌తో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. మొదటి ప్లేస్‌లో సచిన్ ఉన్నారు. ఎన్ని రికార్డులు సాధించిన ఎప్పుడూ తన వ్యక్తిగత మైలేజీ కోసం చూడలేదు. జట్టును గెలిపించడానికి మంచి స్కోర్ సాధించడానికే చెమట చిందిస్తాడు కోహ్లీ. మరోసారి అలాంటి స్పోర్టింగ్‌ స్పిరిట్‌ నిర్ణయంతో అందరి మనసులను దోచేశాడు కోహ్లీ. 


కోహ్లీ నిస్వార్థమైన ఆట తీరుకు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ వేదిక అయింది. 


అప్పటికే 28 బంతుల్లో 49 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీకి దగ్గర్లో ఉన్నాడు కోహ్లీ. ఇంకో ఓవర్‌ మిగిలే ఉంది. 


ఫైనల్‌ ఓవర్‌లో ఫస్ట్‌ బాల్‌ను దినేష్ కార్తీక్‌ బలమైన షాట్‌కు ప్రయత్నించాడు. కానీ మిస్ అయింది. రెండో బాల్‌ బౌండరీకి తరలించాడు. తర్వాత బంతికి పరుగులు రాలేదు. తర్వాత బంతి వైడ్‌బాల్ పడింది. నెక్స్ట్‌ బంతిని సిక్స్ కొట్టాడు దినేష్‌ కార్తీక్. 






ఇంకో రెండు బాల్స్ మిగిలి ఉండగానే కోహ్లీ దగ్గరకు వచ్చాడు కార్తీక్, తర్వాత బాల్‌ను సింగిల్ తీసి ఇస్తాను. హాఫ్‌ సెంచరీ పూర్తి చేస్తావా అని అడిగాడు.


రెండో ఆలోచన లేకుండా కార్తీక్‌ నిర్ణయాన్ని తిరస్కరించాడు. ముందు జట్టు స్కోరు పెంచేందుకు చూడమని సలహా ఇచ్చాడు. మిగతా రెండు బంతులు కూడా మంచి స్కోరు చేసేమన్నాడు కోహ్లీ. 


అంతే అదే ఊపుతో తర్వాత బంతిని ఓవర్‌ ఎక్స్ట్రా కవర్‌ మీదుగా కార్తీక్ సిక్స్‌ కొట్టాడు. తర్వాత బంతికి సింగిల్‌ తీశాడు. అంతే మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది టీమిండియా. 


తర్వాత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఎంత ప్రయత్నించినా 237 పరుగులను ఛేజ్ చేయలేకపోయింది. డేవిడ్‌ మిల్లర్ సెంచరీ చేసినప్పటికీ విజయానికి 16 పరుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో మూడు  మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంత చేసుకుంది. 
  


మొన్నటి మ్యాచ్‌లో కూడా సూర్యకుమార్‌ ఆడుతుంటే అవతలి ఎండ్‌లో చూస్తూ ఆనందించి ఆకట్టుకున్నాడు. సింగిల్స్ తీసి అతనికి స్ట్రైక్‌ ఇచ్చి ప్రోత్సహించాడు.