IND vs SA 1st T20: టీ20 ప్రపంచకప్ నకు సన్నాహకంగా జరిగే ఆఖరి సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచుల సిరీస్ నేటి నుంచే ప్రారంభమవుతోంది. తిరువనంతపురంలోని గ్రీన్ ల్యాండ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.00 లకు మొదటి టీ20 జరగనుంది. 


బ్యాటింగ్ పర్వాలేదు


ఆస్ట్రేలియాతో జరిగిన 3 టీ20 ల సిరీస్ ను 2-1తో చేజిక్కుంచుకున్న భారత్.. ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికాతో బరిలోకి దిగనుంది. ఈ సిరీస్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు విశ్రాంతినిచ్చారు. బ్యాటింగ్ పరంగా చూస్తే టాపార్డర్ లో ఒకరు విఫలమైతే మరొకరు రాణిస్తున్నారు. దీంతో భారత్ భారీ స్కోర్లు చేస్తోంది. రాహుల్ నిలకడగా ఆడాల్సిన అవసరముంది. రోహిత్, కోహ్లీలు ఫామ్ కొనసాగించాలి.  దినేశ్ కార్తీక్ ఫినిషర్ స్థానానికి న్యాయం చేస్తున్నాడు.  అతనికి ఇంకా కొంచెం గేమ్ టైమ్ ఇవ్వాల్సిన అవసరముంది. ఈ సిరీస్ లో పంత్ ను కూడా ఆడించే అవకాశం ఉంది. 


డెత్ కు ఆఖరి ఛాన్స్


భారత్ ను బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లు. గత కొంతకాలంగా భారత బౌలర్లు ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. భువీ దూరమైన నేపథ్యంలో దీపక్ చాహర్ కానీ, అర్హదీప్ సింగ్ కానీ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. బుమ్రా, హర్షల్ పటేల్ లు అంచనాలకు తగ్గట్లు రాణించాలి. అక్షర్ పటేల్ భీకర ఫాంలో ఉండడం భారత్ కు కలిసొచ్చే అంశం. ఆసీస్ తో చివరి మ్యాచులో ఫామ్ లోకి వచ్చిన చాహల్ అది కొనసాగించాలి. 


కూర్పు ఎలా


ఆస్ట్రేలియాతో సిరీస్ లో అవకాశం రాని వాళ్లను దక్షిణాఫ్రికాతో ఆడించే అవకాశం ఉంది. అశ్విన్, దీపక్ చాహర్, పంత్ లాంటి వాళ్లకు తుది జట్టులో చోటుంటుందేమో చూడాలి. మెగా టోర్నీకి ముందు తుది జట్టు కూర్పును సరిచూసుకోవడానికి ఇదే చివరి అవకాశం కనుక.. అందులో ఆడే ఆటగాళ్లకు జట్టు యాజమాన్యం ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటోంది. ఈ సిరీస్ తో దాదాపుగా టీ20 ప్రపంచకప్ తుది జట్టుపై అంచనాకు వస్తారు. 


దక్షిణాఫ్రికా బలంగానే


మరోపక్క దక్షిణాఫ్రికా బలంగా కనిపిస్తోంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రొటీస్ జట్టు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. డికాక్, బవుమా, మార్ క్రమ్, మిల్లర్ వంటి బ్యాట్స్ మెన్లు.. రబాడ, హెన్రిచ్, నోర్జే, కేశవ్ మహరాజ్ వంటి బౌలర్లతో దక్షిణాఫ్రికా భీకరంగా కనిపిస్తోంది. ఆ జట్టుకు కూడా టీ20 ప్రపంచకప్ ముంగిట ఇదే చివరి సిరీస్. కాబట్టి దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ సిరీస్ హోరాహోరీగా సాగనుంది. 


పిచ్ పరిస్థితి


గ్రీన్ ఫీల్డ్ మైదానం ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచులకే ఆతిథ్యమిచ్చింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. ఓ టీ20లో రెండు ఇన్నింగ్సుల్లోనూ 170కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఈరోజు జల్లులు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ సమాచారం.


భారత జట్టు (అంచనా)


 రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్. రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, షాబాజ్ అహ్మద్శ్రే, యస్ అయ్యర్.


దక్షిణాఫ్రికా జట్టు( అంచనా)


 క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రిలీ రోసౌవ్, అయిడెన్ మార్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షంసీ, రీజా హెండ్రిక్స్, లుంగీ హెండ్రిక్స్, కేశవ్ మహారాజ్, హెన్రిచ్ క్లాసెన్.