ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా యావరేజ్ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (87: 90 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), ఇషాన్ కిషన్ (82: 81 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలతో రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ విజయానికి 300 బంతుల్లో 266 పరుగులు కావాలి.


ఆరంభంలో వరుస వికెట్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత్‌కు ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది. టీమిండియా బ్యాటింగ్ మూల స్తంభాలు రోహిత్ శర్మ (11: 22 బంతుల్లో, రెండు ఫోర్లు), విరాట్ కోహ్లీ (4: 7 బంతుల్లో, ఒక ఫోర్) ఇద్దరూ విఫలం అయ్యారు. వీరిద్దరినీ షహీన్ అఫ్రిది బౌల్డ్ చేసి భారత్‌ను చావు దెబ్బ కొట్టాడు. దీంతో 27 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత టీమిండియా వైఫల్యాల పరంపర ఆగలేదు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (10: 32 బంతుల్లో, ఒక ఫోర్) కూడా విఫలం అయ్యాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ (14: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.


అదరగొట్టిన ఇషాన్, హార్దిక్
ఇక 150 పరుగులు చేయడం కూడా కష్టమే అనుకున్న దశలో ఇషాన్ కిషన్ (82: 81 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (87: 90 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) భారత్‌ను ఆదుకున్నారు. ప్రారంభంలో అనవసరపు భారీ షాట్లకు పోకుండా క్రీజులో కుదురుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఒక్కసారి టచ్‌లోకి వచ్చాక ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగాడు. హార్దిక్ మరో ఎండ్‌లో అతనికి చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలోనే మొదట ఇషాన్ కిషన్, తర్వాత హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.


వీరిద్దరూ ఐదో వికెట్‌కు 141 బంతుల్లోనే 138 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా గేర్ మార్చాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి అఘా సల్మాన్ చేతికి చిక్కాడు. అయితే చివర్లో జస్‌ప్రీత్ బుమ్రా (16: 14 బంతుల్లో, మూడు ఫోర్లు) తన శక్తి మేరకు పోరాడాడు. కానీ ఆఖర్లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 48.5 ఓవర్లలో 266 పరుగులకే ఆలౌట్ అయింది. షహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టాడు. నసీం షా, హరీస్ రౌఫ్ మూడేసి వికెట్లు దక్కించుకున్నారు.


భారత్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


పాకిస్థాన్ తుదిజట్టు
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial