IND vs PAK Champions Trophy 2025: చిరకాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ మ‌ధ్య పోరు ఆదివారం జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. క్రికెట్ ప్ర‌పంచం అంతా దీనిపైనే ఫోక‌స్ పెట్టింది. వ‌న్డేల్లో పాక్ కంటే భార‌తే ఫేవ‌రెట్ గా క‌నిపిస్తోంది. జ‌ట్టులో మ్యాచ్ విన్న‌ర్ల‌కు కొదువ‌లేదు. అలాగే సీనియ‌ర్లు కూడా చాలామందే ఉన్నారు. ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలాంటి మెగా టోర్నీ్ల్లో ఒత్తిడిని ఎదుర్కొని, నిలిచే ద‌మ్ము భార‌త్ కే ఉంద‌ని తాజాగా భార‌త మాజీ ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ వ్యాఖ్యానించాడు. పాక్ తో పొలిస్తే చాలా విష‌యాల్లో బార‌త్ మెరుగ్గా ఉంద‌ని వ్యాఖ్యానించాడు.

తాజాగా ఇంటర్నేష‌నల్ మాస్ట‌ర్స్ లీగ్ ప్రారంభం సంద‌ర్భంగా అందులో పాల్గొనేందుకు ఇర్ఫాన్ ప‌ఠాన్ ముంబై వ‌చ్చాడు. దిగ్గ‌జ ప్లేయ‌ర్లు అంతా ఇందులో బ‌రిలోకి దిగుతున్నారు. భార‌త్ తోపాటు శ్రీలంక‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ త‌దిత‌ర జ‌ట్లు పాల్గొంటున్నాయి. స‌చిన్  టెండూల్క‌ర్ .. భార‌త్ కు కెప్టెన్సీ వ‌హిస్తుండ‌గా, కుమార సంగక్క‌ర, శ్రీలంక జ‌ట్టుకు, బ్రియాన్ లారా.. వెస్టిండీస్ జ‌ట్టును నడిపించ‌బోతున్నారు. ఈ టోర్నీ కోసం ఆట‌గాళ్లు ముమ్మ‌రంగా సాధ‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. 

ట్రాక్ రికార్డు..గ‌త కొంత‌కాలంగా భార‌త్ ట్రాక్ రికార్డును ప‌రిశీలించిన‌ట్లయితే ఒత్తిడిని ఎదుర్కొని, నిలిచి గెలుస్తోంద‌ని ప‌ఠాన్ వ్యాఖ్యానించాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ లాంటి సీనియ‌ర్ల‌తోపాటు శుభ‌మాన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ ల‌తో బ్యాటింగ్ చాలా ప‌టిష్టంగా ఉంద‌ని తెలిపాడు. అక్ష‌ర్ పటేల్ బంతితోనూ వికెట్లు తీస్తుండటంతో ఆల్ రౌండ‌ర్ల విష‌యంలో భారత్ కు ఢోకా లేకుండా పోయింద‌ని తెలిపాడు. బంగ్లాదేశ్ తో జరిగిన గ‌త మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన మ‌హ్మ‌ద్ ష‌మీని ప్ర‌శంసించాడు. చాలాకాలం త‌ర్వాత పున‌రాగ‌మ‌నం చేసి స‌త్తా చాట‌డం స‌వాలుతో కూడుకుని ఉంటుంద‌ని, ష‌మీ దాన్ని అద్భుతంగా చేసి చూపించాడ‌ని పేర్కొన్నాడు. గ‌త మ్యాచ్ లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ గా ష‌మీ రికార్డుల‌కెక్కాడు. ఇక పాక్ లో ఒత్తిడిని తట్టుకుని ఆడే ప్లేయర్లు లేరని, ఆ జట్టులో చాలా సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. 

స‌చిన్ తో ప్ర‌త్యేక‌మే..మాస్ట‌ర్ లీగ్ గురించి ప‌ఠాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. స‌చిన్ తో క‌లిసి గ‌తంలో ప‌దేళ్లు ఆడాన‌ని, ఇప్పుడు తిరిగి అత‌నితో ఆడుతుండటంపై ఎగ్జైటింగ్ గా ఉంద‌ని వ్యాఖ్యానించాడు. స‌చిన్ తో కలిసి మైదానంలో బ‌రిలోకి దిగ‌డం, మాట‌ల‌కు అంద‌ని అద్బుత‌మ‌ని తెలిపాడు. ఇప్ప‌టికే తాము ఈ టోర్నీ కోసం సిద్ధ‌మ‌య్యామ‌ని తెలిపాడు. మల్టీ నేష‌న‌ల్ ఫార్మాట్ లో జ‌రుగుతున్న ఈ టోర్నీ నవీ ముంబైలో జ‌రుగుతుంది. ఇక భార‌త్, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్ ఆదివారం జ‌రుగుతుంది. మెగాటోర్నీ తొలి మ్యాచ్ లో బంగ్లాపై భార‌తు ఆరు వికెట్ల‌తో నెగ్గ‌గా, న్యూజిలాండ్ చేతిలో 60 ప‌రుగుల‌తో పాక్ ఓడిపోయింది. భార‌త్ చేతిలో ఓడిపోతే పాక్ క‌థ దాదాపు స‌మాప్త‌మైన‌ట్లే. 

Read Also: WPL 2025 MI Vs RCB Result Update: హ‌ర్మ‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అమ‌న్ ఆల్ రౌండ్ షో.. ముంబై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ఆర్సీబీ వ‌రుస విజ‌యాల‌కు చెక్