ఆసియా కప్‌లో భారత్‌ను వర్షం ముప్పు వదలడం లేదు. పాకిస్తాన్ మ్యాచ్‌ తరహాలోనే నేపాల్ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో నేపాల్ 230 పరుగులకు ఆలౌట్ అయింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగాక మళ్లీ వర్షం ప్రారంభం అయింది. వర్షంతో మ్యాచ్ ఆగే సమయానికి భారత్ 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. 10:20 వరకు మ్యాచ్ ప్రారంభం కాకపోతే రద్దు చేస్తారు. భారత్ సూపర్-4కు అర్హత సాధిస్తుంది.


ఓవర్లు తగ్గితే టార్గెట్ ఎలా ఉండవచ్చు?
ఒకవేళ కేవలం 20 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయితే భారత్ లక్ష్యం 130 పరుగులుగా ఉండనుంది. 30 ఓవర్లకు కుదిస్తే భారత్ 174 పరుగులు చేయాల్సి ఉంటుంది. 35 ఓవర్ల ఆట సాధ్యం అయితే 192 పరుగులను, 40 ఓవర్ల ఆట సాధ్యం అయితే మాత్రం భారత్ 207 పరుగులు ఛేదించాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తూ 45 ఓవర్ల మ్యాచ్ జరిగితే 207 పరుగులను భారత్ ఛేదించాలి. మ్యాచ్ ప్రారంభం అయినా ఏ క్షణంలో అయినా తిరిగి వర్షం పడి ఆట ఆగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ దాన్ని దృష్టిలో పెట్టుకునే మొదటి బంతి నుంచి బ్యాటింగ్ చేయాలి.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. కానీ భారత్‌కు ఆశించిన స్టార్ట్ లభించలేదు. ఆరంభంలోనే ఓపెనర్లు ఇచ్చిన మూడు క్యాచుల్ని మన ఫీల్డర్లు నేలపాలు చేశారు. నేపాలీలకు అమేజింగ్‌ ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ లభించింది. మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో బంతికి ఓపెనర్ కుశాల్‌ స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. కానీ దాన్ని శ్రేయస్‌ అయ్యర్‌ వదిలేశాడు. తర్వాత మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 1.1వ బంతికి ఆసిఫ్ ఔటవ్వాల్సింది. షార్ట్‌పిచ్‌ వద్ద కోహ్లీ ఈ సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. మళ్లీ షమీ వేసిన 4.2 ఓవర్ బంతికీ భూర్తెల్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్‌ మిస్‌ జడ్జ్‌ చేశాడు. దొరికిన అవకాశాలను ఓపెనర్లు ఇద్దరూ సద్వినియోగం చేసుకున్నారు. తొలి వికెట్‌కు కేవలం 59 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం అందించారు. పదో ఓవర్లో గానీ భారత్‌కు వికెట్‌ దొరకలేదు.


మొత్తానికి 10వ ఓవర్లో కుశాల్‌ను శార్దూల్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా వరుసగా భీమ్‌ షాక్రి (7), రోహిత్‌ పౌడెల్‌ (5), కుశాల్‌ (2)ను పెవిలియన్‌ బాట పట్టించాడు. ఈ పరిస్థితుల్లో గుల్షన్‌ ఝా (23; 35 బంతుల్లో 3x4), దీపేంద్ర సింగ్‌ (29; 25 బంతుల్లో 3x4) భారత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఔటయ్యాక అయినా వికెట్ల పతనం మొదలవుతుందని ఆశిస్తే.. వరుణుడు సీన్లోకి ఎంటరయ్యాడు. వర్షం కురిపించి మ్యాచ్‌కు గంటన్నర పాటు అంతరాయం కలిగించాడు.


తిరిగి ఆట మొదలయ్యాక నేపాల్ బ్యాటర్ సోంపాల్‌ కామీ ఆడిన తీరు హ్యాట్సాఫ్.  టీమ్‌ఇండియా బౌలర్లను అతడు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీపేంద్రతో కలిసి సింగిల్స్‌ తీస్తూ ఆరో వికెట్‌కు 56 బంతుల్లో 50 పరుగుల కీలకమైన భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 194 వద్ద దీపేంద్రను హార్దిక్ పాండ్య ఔట్‌ చేశాడు. ఆ తర్వాత సందీప్‌ లామిచాన్‌ (9)తో కలిసి ఏడో వికెట్‌కు 37 బంతుల్లో 34 పరుగుల పార్ట్‌నర్ షిప్ నెలకొల్పాడు. సొగసైన బౌండరీలు, సిక్సర్లు బాది బౌలర్లను పరీక్షించాడు. కొరకరాని కొయ్యగా మారిన అతడిని ఇన్నింగ్స్ 48వ ఓవర్లో మహ్మద్‌ షమీ ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 228 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత మరో 2 పరుగులకే మిగిలిన ఇద్దరూ ఔటవ్వడంతో నేపాల్‌ 230కి పరిమితమైంది.