ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ భారత్ చేతిలోకి దాదాపు వచ్చేసినట్లే. మూడో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 132 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దాన్ని కూడా కలుపుకుంటే ఇప్పటికే టీమిండియా ఇప్పటికే 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ఛతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ ఉన్నారు.


132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ మూడో బంతికే అవుటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ పుజారా, హనుమ విహారి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 39 పరుగులు జోడించారు.


అనంతరం బ్రాడ్... హనుమ విహారిని అవుట్ చేసి రెండో వికెట్‌ను ఇంగ్లండ్‌కు అందించారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (20: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు) పేలవ ఫాం ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగింది. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు.


ఆ తర్వాత రిషబ్ పంత్, పుజారా మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఇప్పటికే 50 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా ఆట ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇప్పటికే 257 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు కాబట్టి నాలుగో రోజు వీలైనంత వేగంగా ఆడి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తే భారత బౌలర్లకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. అదే సమయంలో ఇటీవల ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ మైండ్ సెట్ కూడా మారిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. న్యూజిలాండ్‌పై భారీ లక్ష్యాలను కూడా అలవోకగా ఇంగ్లండ్ ఛేదించింది. కాబట్టి వారిని కూడా లైట్ తీసుకోవడానికి లేదు. ఏదేమైనా నాలుగో రోజు ఆటకు కీలకంగా మారనుంది.