భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. రెండో రోజు టీ విరామం సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (4: 11 బంతుల్లో, ఒక ఫోర్), ఛతేశ్వర్ పుజారా (3: 9 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (15: 26 బంతుల్లో, రెండు ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (13: 15 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం అయ్యారు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంకా 432 పరుగులు వెనకబడి ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోవడానికి 233 పరుగులు చేయాలి.


అంతకు ముందు ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా పెవిలియన్‌కు పంపించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో ట్రావిస్ హెడ్ (163: 174  బంతుల్లో, 25 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవ్ స్మిత్ (121: 268 బంతుల్లో, 19 ఫోర్లు) సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.


వేగంగా మొదలై...
భారత జట్టు ఇన్నింగ్స్ వేగంగా మొదలైంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మూడు ఓవర్లకే 22 పరుగులు సాధించారు. నాలుగు, ఐదు ఓవర్లలో పెద్దగా పరుగులు రాలేదు. ప్యాట్ కమిన్స్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతిని లెగ్ సైడ్ ఆడబోయిన రోహిత్ శర్మ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. తర్వాత నాలుగు బంతుల వ్యవధిలోనే శుభ్‌మన్ గిల్‌ను స్కాట్ బోలాండ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.


హెడ్ తర్వాత టపటపా...
అంతకు ముందు రెండో రోజు ఆట ప్రారంభం అయిన మొదటి మూడు బంతుల్లోనే స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 95 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్ స్మిత్... మహ్మద్ సిరాజ్ వేసిన మొదటి ఓవర్ రెండు, మూడు బంతులను బౌండరీలుగా తరలించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కూడా 150 పరుగుల మైలురాయిని దాటాడు.


ఆట ప్రారంభం అయ్యాక ఏడో ఓవర్లో ట్రావిస్ హెడ్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ పుల్ షాట్ ఆడబోయిన హెడ్... వికెట్ కీపర్ కేఎస్ భరత్ చేతికి చిక్కాడు. దీంతో నాలుగో వికెట్‌కు వీరిద్దరూ జోడించిన 285 పరుగుల భాగస్వామ్యం విడిపోయింది. భారత్‌కు ఊరట కలిగింది. ఆ తర్వాత కాసేపటికే కామెరాన్ గ్రీన్ (6: 7 బంతుల్లో, ఒక ఫోర్), స్టీవ్ స్మిత్ కూడా అవుటయ్యారు. కానీ మిషెల్ స్టార్క్, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ కలిసి స్కోరును 400 మార్కు దాటించారు. అయితే క్యారీతో సమన్వయ లోపం కారణంగా మిషెల్ స్టార్క్ (5: 20 బంతుల్లో) రనౌట్ అయ్యాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి అలెక్స్ క్యారీ మరో వికెట్ పడకుండా సెషన్‌ను ముగించారు.


రెండో రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 422 పరుగులు సాధించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9: 34 బంతుల్లో), అలెక్స్ క్యారీ (48: 69 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) ఎనిమిదో వికెట్‌కు 51 పరుగులు జోడించి ఆఖర్లో ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. అలెక్స్ క్యారీ అవుటయ్యాక నాథన్ లియాన్ (9: 25 బంతుల్లో, ఒక ఫోర్), ప్యాట్ కమిన్స్ (9: 34 బంతుల్లో) కూడా త్వరగా అవుటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ తీసుకున్నాడు.