భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా నెమ్మదిగా పైచేయి సాధిస్తుంది. తొలి రోజు రెండో సెషన్ ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. క్రీజులో వేగంగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ (60 బ్యాటింగ్: 75 బంతుల్లో, 10 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (33 బ్యాటింగ్: 102 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఉన్నారు.


మొదటి బంతికే షాక్
రెండో సెషన్‌లో మొదటి బంతికే ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో నిలకడగా ఆడుతున్న మార్నస్ లబుషేన్ (26: 62 బంతుల్లో, మూడు ఫోర్లు) క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. కానీ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ భారత్‌కు మరో అవకాశం ఇవ్వలేదు.


100కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడిన హెడ్
ఒక ఎండ్‌లో స్టీవ్ స్మిత్ వికెట్ల ముందు అడ్డుగోడలా నిలబడ్డాడు. మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ బౌండరీలతో చెలరేగాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఒక ఓవర్లో వీరిద్దరూ కలిసి 16 పరుగులు పిండుకున్నారు. ఒకానొక దశలో ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ 100కు పైగా ఉంది. కేవలం 60 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ అర్థ సెంచరీ పూర్తయింది.


మరో స్పిన్నర్ ఉంటే?
వికెట్ తీయడానికి భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రవీంద్ర జడేజా స్పిన్‌ను ఆడటానికి వీరు కాస్త తడబడ్డారు. కానీ మరో ఎండ్‌లో పేస్ బౌలింగ్‌లో పరుగులు పిండుకున్నారు. జడ్డూకు తోడుగా రెండో ఎండ్‌లో మంచి స్పిన్నర్ ఉంటే టైట్ చేసే అవకాశం ఉండేది.






అంతకుముందు టీమ్‌ఇండియా టాస్ గెలవగానే బౌలింగ్‌ ఎంచుకుంది. కండీషన్స్‌ను బాగానే ఉపయోగించుకుంది. జట్టు స్కోరు 2 వద్దే ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్ ఖవాజా (0)ను మహ్మద్ సిరాజ్‌ ఔట్‌ చేశాడు. వుబుల్‌ సీమ్‌తో వచ్చిన బంతి ఖవాజా బ్యాటు అంచుకు తగిలి వికెట్‌ కీపర్‌ భరత్‌ చేతుల్లో పడింది. ఈ సిచ్యువేషన్లో డేవిడ్‌ వార్నర్‌ (43; 60 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), మార్నస్‌ లబుషేన్‌ క్రీజులో నిలబడ్డారు. రెండో వికెట్‌కు 108 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ చక్కని బంతుల్ని గౌరవిస్తూనే దొరికిన వాటిని బౌండరీకి తరలించారు.


మహ్మద్‌ షమి, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌ చక్కని లెంగ్తుల్లో బంతులు వేశారు. దాంతో వీరి బౌలింగ్‌ను వార్నర్‌, లబుషేన్‌ జాగ్రత్తగా ఆడారు. అయితే ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌ను మాత్రం అటాక్‌ చేశారు. ముఖ్యంగా వార్నర్‌ చక్కని షాట్లతో చెలరేగాడు. వరుస బౌండరీలు బాదారు. ఈ జోడీని విడదీయడానికి పేసర్లు కాస్త కష్టపడాల్సి వచ్చింది. చివరికి శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 21.4వ బంతికి వార్నర్‌ ఔటయ్యాడు. డౌన్‌ ది లెగ్‌ భుజాల ఎత్తులో వచ్చిన బంతిని పుల్‌ చేయబోయిన అతడు కీపర్ భరత్‌కు చిక్కాడు. గ్లోవ్స్ తాకి లెగ్‌సైడ్‌ వెళ్తున్న బంతికి కీపర్‌ డైవ్‌ చేసి అద్భుతంగా ఒడిసిపట్టాడు. మరికాసేపటికే లంచ్‌ బ్రేక్‌ అనౌన్స్‌ చేశారు.