Ind vs Aus 3rd odi: 


నేడు రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మూడో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సిరీసులో ఇదే ఆఖరి పోరు. దీని తర్వాత మూడు టీ20ల సిరీస్‌ మొదలవుతుంది.


ప్యాట్‌ కమిన్స్‌, ఆస్ట్రేలియా సారథి: మేం మొదట బ్యాటింగ్‌ చేస్తాం. వికెట్‌ బాగుంది. వంద ఓవర్లలో ఎలా మారుతుందో తెలియదు. అందరికీ గేమ్‌ టైమ్‌ లభించడం అవసరం. నేరుగా ప్రపంచకప్‌కు వెళ్లడం బాగుండదు. ఇప్పటి వరకు ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. కానీ మేం సానుకూలంగా ఆడతాం. భారత్‌లో వేర్వేరు పరిస్థితులు ఉంటాయి. అయితే ఇవి మాకు సుపరిచితమే. జట్టులో ఐదు మార్పులు చేశాం. మిచెల్‌ స్టార్క్‌, మాక్స్‌వెల్‌ వచ్చారు. తన్వీర్‌ సంఘా అరంగేట్రం చేస్తున్నాడు.


రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌: రాజ్‌కోట్‌లో వాతావరణం, పరిస్థితులు బాగుంటాయి. ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా లేదు. ఈ ఒక్క గేమ్‌ గురించే ఆలోచిస్తున్నాం. శారీరకంగా పోలిస్తే మానసికంగా పునరుత్తేజం పొందేందుకు విరామాలు చాలా అవసరం. మేం ఆడుతున్న విధానానికి ఆనందంగా ఉన్నాం. అన్ని విభాగాల్లో రాణిస్తున్నాం. మేం ఇంకేం చేయడానికైనా అవకాశాలు ఉన్నాయి. పిచ్‌ కాస్త మందకొడిగా ఉంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఇంకా బాగుంటుంది. ఎలాగైనా మేం ఛేదనకే దిగాలనుకున్నాం. మేం రెండు కొత్త బంతులు తీసుకుంటామేమో చూడాలి. నేను, విరాట్‌, కుల్‌దీప్‌ తిరిగొచ్చాం. అశ్విన్‌ ఆడటం లేదు. వాషింగ్టన్‌ వచ్చాడు. ఇషాన్‌కు ఒంట్లో బాగాలేదు. వైరల్‌ ఫీవర్‌ వచ్చింది.


భారత జట్టు: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ


ఆస్ట్రేలియా జట్టు: మిచెల్‌ మార్ష్‌, డేవిడ్ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, అలెక్స్‌ కేరీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కామెరాన్‌ గ్రీన్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, తన్వీర్‌ సంఘా, జోష్ హేజిల్‌వుడ్‌


పిచ్‌ రిపోర్టు: మైదానం పచ్చికతో మెరుస్తోంది. స్క్వేర్‌ బౌండరీలు 66 మీ, 67 మీటర్లు ఉన్నాయి. స్ట్రెయిట్‌గా బౌండరీ కొట్టాలంటే 79 మీటర్లు వెళ్లాలి. పిచ్‌పై పచ్చిక ఉంది. ముందు మ్యాచులతో పోలిస్తే వికెట్‌ కఠినంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 311. బంతి స్పిన్‌ అవ్వడం కన్నా జారిపోవడమే ఎక్కువగా ఉండొచ్చని సంజయ్‌ మంజ్రేకర్‌, బ్రాడ్‌ హడిన్‌ అన్నారు.


ఆల్ సెట్.. వాళ్లకు ప్రాక్టీస్


ఆసియా కప్‌కు ముందు భారత  వన్డే వరల్డ్ కప్ జట్టుపై ఎన్నో అనుమానాలు. అప్పుడే శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రాలు సుదీర్ఘకాలం విరామం తర్వాత వన్డే జట్టులోకి రావడం, ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించారో లేదో క్లారిటీ లేకపోవడం.. నెంబర్ 4 ఎవరిది..? సూర్యకుమార్ యాదవ్ వైఫల్యాలు, లోయరార్డర్ కష్టాలు.. వంటివి భారత్‌ను వేధించాయి.  కానీ ఆసియా కప్‌లో కొన్ని  ప్రశ్నలకు సమాధానం వెతికిన భారత్‌కు ఆస్ట్రేలియా సిరీస్‌లో  దాదాపు అన్ని బాక్సులను టిక్ చేసింది. ఈ సిరీస్ ద్వారా భారత్‌‌కు కలిగిన లాభం ఏదైనా ఉందా..? అంటే అది కచ్చితంగా శ్రేయస్, సూర్య ఫామ్‌లోకి రావడమే.  ఆసియాకప్‌లోనే  తన పునరాగమనాన్ని ఘనంగా చాటిచెప్పిన రాహుల్.. ఈ సిరీస్‌లో దానిని కొనసాగిస్తూనే  కెప్టెన్‌గా కూడా సక్సెస్ అయ్యాడు.  ఓపెనర్ శుభ్‌మన్ గిల్  తనమీద  ఎంత ధీమా అయినా పెట్టుకోవచ్చు అని భరోసానిచ్చాడు.  ఇషాన్ కూడా టచ్‌లోనే ఉన్నాడు.


వరల్డ్ కప్ టీమ్‌లో ఉన్నవారిలో  దాదాపు అందరికీ మంచి ప్రాక్టీస్ లభించింది. ఇక రాజ్‌కోట్‌లో భారత్ ప్రధానంగా దృష్టి సారించేది కెప్టెన్ రోహిత్ శర్మ,  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మీదే. ఈ ఇద్దరూ రెండు వన్డేలకు రెస్ట్ తీసుకున్నారు. మూడో వన్డేలో మాత్రం ఈ ఇద్దరితో పాటు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ కూడా  జట్టుతో చేరాడు.  ప్రపంచకప్‌కు ముందు వీరికి ఇది మంచి ప్రాక్టీస్ కానుంది.  సీనియర్ల రాకతో గిల్, శార్దూల్‌, షమీలకు విశ్రాంతి దక్కగా  రుతురాజ్ గైక్వాడ్  ఆసియా క్రీడల నిమిత్తం  చైనాకు వెళ్లాడు. ఓపెనర్లుగా రోహిత్ తో కలిసి ఇషాన్ కిషన్ బరిలోకి దిగొచ్చు.  మూడో స్థానంలో కోహ్లీ వస్తే అయ్యర్ 4వ స్థానంలో రాహుల్ ఐదులో రావొచ్చు.  హార్ధిక్ పాండ్యా‌కూ ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో సూర్యను  ఫినిషర్‌గా వాడొచ్చు.  మహ్మద్ సిరాజ్, బుమ్రాలు పేస్ బాధ్యతలు మోయనున్నారు.