ICC WTC Points Table:  టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత పెంచేందుకు ఐసీసీ 2019లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి జట్లు ఆడిన టెస్టులు, పాయింట్లను బట్టి టాప్- 2 లో ఉన్న రెండు జట్లు ఫైనల్ లో ఆడతాయి. గెలిచిన జట్టుకు ఛాంపియన్ షిప్ ట్రోఫీ అందుతుంది. ఈ ట్రోఫీ ప్రవేశపెట్టాక జట్లన్నీ టెస్ట్ మ్యాచులు గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెరుగుతోంది. 


వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభ ఎడిషన్ లో ఫైనల్ లో న్యూజిలాండ్- భారత్ తలపడ్డాయి. ఆ పోరులో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ జట్టు, విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. మొదటి ఎడిషన్ ముగియటంతో ప్రస్తుతం ఇప్పుడు రెండో ఎడిషన్ పై జట్లు దృష్టిసారించాయి. 2021- 2023 కాలానికి ఈ రెండో ఎడిషన్ ఉంటుంది. 9 జట్లు పోటీలో ఉన్నాయి. ఫార్మాట్ అలాగే ఉన్నప్పటికీ.. పాయింట్ల విధానంలో ఐసీసీ కొన్ని మార్పులు చేసింది. 


ప్రారంభ ఎడిషన్ ఇలా..


ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభ ఎడిషన్ లో ప్రతి టెస్ట్ సిరీస్ కు 120 పాయింట్లు ఉండేవి. అంటే ఎన్ని మ్యాచులు ఉంటే ఈ 120 పాయింట్లను అన్ని మ్యాచులకు సమానంగా విభజించారు. ఉదాహరణకు సిరీస్ లో 5 టెస్టులు ఉంటే ప్రతి టెస్టుకు 24 పాయింట్లు కేటాయిస్తారు. ఈ విధానంలో ఏ రెండు జట్లయితే టాప్- 2 పొజిషన్ లో ఉన్నాయో అవి ఫైనల్ ఆడతాయి. అయితే కొవిడ్ -19 రాకతో అంతా తలక్రిందులైంది. చాలా సిరీస్ లు వాయిదా పడ్డాయి. కొన్ని రద్దయ్యాయి. దీంతో కొన్ని జట్లు నష్టపోయాయి. అందుకే ఈ సారి ఛాంపియన్ షిప్ నియమాలను ఐసీసీ కొన్ని మార్చింది. 


2021- 2023 ఎడిషన్ ఇలా..


ఈసారి పాయింట్ల పట్టికలో శాతాన్ని చేర్చారు. అంటే ఒక జట్టు ఆడిన మ్యాచ్ లు, సాధించిన పాయింట్లను బట్టి శాతాన్ని నిర్ణయిస్తారు. ఈ పాయింట్ల శాతం ఆధారంగా ర్యాంకింగ్స్ స్టాండింగ్స్ ఉంటాయి. అలాగే ఒక్కో టెస్టుకు పాయింట్లు ఒకేలా ఉంటాయి. అంటే ఒక టెస్ట్ మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి. డ్రా అయితే 4 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు వస్తాయి. ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు. అయితే ప్రతి జట్టు స్వదేశంలో 3 సిరీస్ లు, బయట 3 సిరీస్ లు ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ తన దేశంలో భారత్ తో ఆడిన టెస్ట్ సిరీస్ తో ఈ ఛాంపియన్ షిప్ ప్రారంభమైంది. 






పాయింట్ల శాతాన్ని ఇలా లెక్కిస్తారు


జట్టు గెలిచిన పాయింట్లు/ పోటీ చేసిన పాయింట్లు * 100


టాప్- 2 లో ఆ రెండు జట్లు


ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, భారత్ లు టాప్- 2 లో ఉన్నాయి. ఆసీస్ 120 పాయింట్లు, 76. 92 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక టీమిండియా 87 పాయింట్లు, 55.77 శాతంలో రెండో స్థానంలో నిలిచింది.